డీకే అరెస్టు, ఒక్కలిగుల భారీ ధర్నా, మాజీ సీఎం ఢుమ్మా, నన్ను ఎవ్వరూ ఏం చెయ్యలేరు !
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ఒక్కలిగ కులంలో ప్రభావంతమైన నాయకుడు డీకే. శివకుమార్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చెయ్యడాన్ని నిరసిస్తూ బెంగళూరు నగరంలో ఒక్కలిగులు భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి ఈ ధర్నాకు హాజరు కాకపోవడంతో చర్చకు దారి తీసింది.
ఐశ్వర్యకు రూ. 100 కోట్ల ఆస్తి ఎలా వచ్చింది ?, ఈడీకి అనుమానం, అరెస్టు చేస్తారా, అయితే ?!
బెంగళూరులో భారీ ర్యాలీ
బెంగళూరు నగరంలో బుధవారం బసవనగుడి నేషనల్ కాలేజ్ మైదానం నుంచి ఫ్రీడం పార్క్ వరకు ప్రపంచ ఒక్కలిగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
మాజీ మంత్రులు
కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్, మాజీ మంత్రులు రామలింగా రెడ్డి, కృష్ణభైరే గౌడ, మాజీ ఎంపీ ఎల్ఆర్. శివమారమేగౌడ, వీఎస్. ఉగ్రప్ప, బెంగళూరులోని జయనగర ఎమ్మెల్యే సౌమ్యా రెడ్డి, బీబీఎంపీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, పెద్ద సంఖ్యలో ఒక్కలిగులు ఈ ర్యాలీ, ధర్నాలో పాల్గొన్నారు.
మాజీ ప్రధాని, మాజీ సీఎం ఢుమ్మా
ప్రపంచ ఒక్కలిగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ, ధర్నాకు మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్.డీ. దేవేగౌడ, ఆయన కుమారుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామిని ఆహ్వానించారు. అయితే హెచ్.డీ. దేవేగౌడ, హెచ్.డీ కుమారస్వామి ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
ఆహ్వానం లేదు
చెన్నపట్టణలో బుధవారం ఓ కార్యక్రమానికి హాజరైన మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ తనకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని, ముందుగా నిర్ణయించిన ఈ కార్యక్రమానికి హాజరైనానని అన్నారు. తాను ఒక్కలిగుల ర్యాలీ, ధర్నా కార్యక్రమానికి హాజరుకాకపోయినా జేడీఎస్ పార్టీ నాయకులు, వేలాది మంది కార్యకర్తలు హాజరైనారని మాజీ సీఎం కుమారస్వామి మీడియాకు చెప్పారు.
నన్ను ఎవ్వరు ఏమీ చెయ్యలేరు
ఒక్కలిగులు నిర్వహించిన ర్యాలీ సందర్బంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో తన పేరు, ఫోటో ఉందని తెలిసిందని, అయితే ముందుగా తనను ఆహ్వానించి ఉంటే కచ్చితంగా ధర్నాకు హాజరు అయ్యేవాడినని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. కుమారస్వామిని అరెస్టు చేస్తారని బ్యానర్లు వేశారని, అయితే ఈ కుమారస్వామిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని, తాను ఏ తప్పు చెయ్యలేదని మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి అన్నారు.