గాంధీల స్వయం కృతాపరాధమే ఎస్పీజీ తొలగింపుకు కారణమా...?
ఎంపీ , ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన కుటుంబం చేసుకున్న స్యయం కృతాపరాధమే వారి బద్రత కుదింపుకు కారణమైందా.... ఎస్పీజీ భద్రతా వలయాన్ని వదిలి వందలసార్లు ఒంటరిగా వెళ్లినందుకే ఎస్పీజీని తొలగించారా... అంటే అవుననే సమాధానం వస్తుంది.. ఎస్పీజీ భద్రత దేశంలో ప్రధాని మోడీ తర్వాత సోనియా గాంధీ కుటుంబానికి మాత్రమే ఉంది. ఇలాంటీ భద్రత ఉన్న వ్యక్తులు భద్రతా వలయం దాటి ఒక్క అడుగు కూడ బయటకు వెళ్లలేని పరిస్థితులు ఉంటాయి. అయితే రాహుల్ గాంధీ మాత్రం ఇందుకు విరుద్దంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనతోపాటు కుటుంబానికి సైతం ఎస్పీజీ భద్రతను తొలగించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
1991 నుండి సోనియా కుటుంబానికి ఎస్పీజీ భద్రత
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు, ఎంపీ రాహుల్ గాంధీ , కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలకు ఉన్న ఎస్పీజీ భద్రతను ఉపసంహరించారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండడం తో పాటు విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోనియా గాంధీతోపాటు రాహుల్ , ప్రియాంక గాంధీలు పలు సార్లు భద్రతాపరమైన నిబంధనలను ఉల్లంగీంచారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అందుకే అత్యంత కట్టుదిట్టమైన భద్రతను తొలగించి జడ్ ప్లస్ భద్రతను కల్పించారని అధికారుల సమాచారం. దీంతో 1991 నుండి ఉన్న ఎస్పీజీ భద్రతా వలయాన్ని తొలగించినట్టు తెలుస్తోంది.
1892 సార్లు ఎస్పీజీ లేకుండా వెళ్లిన రాహుల్ ..
ముఖ్యంగా 2015వ సంవత్సరం నుండి రాహూల్ గాంధీ ఎస్పీజీ సిబ్బందికి సహకరించకపోవడంతో పాటు అప్పటి నుండి గత మే 2019 వరకు మొత్తం 1892 సార్లు భద్రతా నియమాలను ఉల్లంఘించారని తెలిపారు. దీంతో సగటున రోజుకు ఒకసారి ఆయన భద్రతా నియమాలను ఉల్లంఘించినట్టు స్పష్టమవుతుందని చెప్పారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకుండా ఢిల్లీలో కూడ పలుసార్లు సంచరించినట్టు తెలిపారు. ఇలా చాలా సార్లు ఎస్పీజీకి సహకరించకపోవడంతో ఎస్పీజీ భద్రత తొలగింపుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.
విదేశీ ప్రయాణాలకు సైతం ఎస్పీజీ లేకుండానే...
ఇక రాహుల్ గాంధీ తరచు విదేశీ ప్రయాణాలు చేస్తున్న విషయాన్ని కూడ ప్రస్తావించారు. ఆయన ఎలాంటీ సమాచారం లేకుండా ఢిల్లీ అవతల ప్రయాణాలు కొనసాగించారని వివరించారు. ఇలా గత అయిదు సంవత్సరాల్లో 250 సార్లు ఢిల్లీ అవతలి ప్రాంతంలో బుల్లెట్ ఫ్రూఫ్ లేని వాహనంలో ప్రయాణించాడని చెప్పారు.ఈ నేపథ్యంలోనే 1991 నుండి 156 సార్లు విదేశాలకు ప్రయాణం చేసిన రాహుల్ గాంధీ... 143 సార్లు ఎస్పీజీ భద్రత లేకుండానే వెళ్లాడని వివరించారు. ఇక సోనియా, ప్రియాంక గాంధీలు కూడ మొత్తం 389 సార్లు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం లేకుండానే ప్రయాణించారని అధికారులు వెళ్లడించారు.