చరిత్ర చెబుతున్న సత్యాలు: గాంధీ పోరాటం నల్లజాతీయులపైనేనా... దక్షిణాఫ్రికాలో ఏం జరిగింది..?
జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలు 2019లో జరిపేందుకు మోడీ సర్కార్ ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఘనా దేశంలోని ఓ యూనివర్శిటీలో మహాత్ముడికి అవమానం జరిగింది. ఆ యూనివర్శిటీ క్యాంపస్లో ఉన్న గాంధీ విగ్రహాన్ని విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, విద్యార్థులు రాత్రికి రాత్రే తీసేసి పక్కకు పెట్టారు. ఒక దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహాత్ముడిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వారి ఆగ్రహం వెనక కారణం ఏమిటి... గాంధీ తమ జాతికి వ్యతిరేకంగా వ్యవహరించారని ఎందుకు చెబుతున్నారు...?
ఘనాలో గాంధీ విగ్రహాలు తొలగింపు
మహాత్మా గాంధీ... ప్రపంచ వ్యాప్తంగా అహింసావాదిగా పేరొందిన గొప్ప వ్యక్తి. తన అహింసా మంత్రంతోనే ఇంత పెద్ద భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని ప్రపంచదేశాలచే కొనియాడబడుతున్న మనిషి గాంధీ. ఇదంత ఇలా ఉంటే... ఆఫ్రికా దేశం అయిన ఘనాలో మాత్రం గాంధీ పేరు చెబితేనే అక్కడి వారు మండిపడుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ ఘనా ఏకంగా తమ క్యాంపస్లో ఏర్పాటు చేసిన గాందీ విగ్రహాన్ని తీసేసింది. ఒకమాటలో చెప్పాలంటే కూల్చేసింది. ఇందుకు కారణం కూడా వారు చెబుతున్నారు. గాంధీ నల్లజాతీయులపై చిన్నచూపు చూశారని ఆరోపిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో గాంధీ ఉన్నసమయంలో నాడు ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్న నల్లజాతీయులపై వివక్ష చూపించారని ఆరోపించారు. నల్లజాతీయులను గాంధీ ఒక అనాగరికత మనుష్యులుగా చూసేవారని చెప్పడమే కాదు శ్వేత జాతీయులకే దక్షిణాఫ్రికాలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కొన్నిచోట్ల రాశారని చెప్పారు.
గాంధీపై వచ్చిన పుస్తకాలన్నీ గొప్పతనాన్నే చాటాయి..?
గాంధీ నిజంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అని చెప్పేదానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఎందుకంటే గాంధీపై వచ్చిన పుస్తకాలు దాదాపు ఆయన గొప్పతనాన్నే చాటాయి. 20వ శతాబ్దపు గొప్ప వ్యక్తుల్లో గాంధీ ఎప్పుడూ ముందువరుసలోనే ఉంటారని చెప్పాయి. అయితే ఇంతకాలానికి మళ్లీ గాంధీ పేరు ఎందుకు తెరపైకి వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాదు నాడు నల్లజాతీయులపై గాంధీ చేసిన వ్యాఖ్యలను చరిత్రకారులు మేధావులు ఎందుకు దాచిపెట్టారనేదానిపై కూడా చర్చ జరుగుతోంది. దశాబ్దాల పాటు దక్షిణాఫ్రికా కూడా ఓ స్లోగన్ ఇస్తూ వచ్చింది. భారతదేశం తమకు మోహన్ దాస్ను ఇచ్చిందని తిరిగి భారత్కు తాము ఓ మహాత్ముడిని అందిచామని చెప్పుకొచ్చింది. బహుశా గాంధీ శ్వేతజాతీయులను పొగడటం వల్లనే వారు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారా అనే అనుమానం తలెత్తుతోంది. నల్లజాతీయులపై గాంధీ నిజంగానే పోరాడి ఉంటే కచ్చితంగా నాడు దక్షిణాఫ్రికాను ఏలిన శ్వేతజాతీయులు ఈ కామెంట్స్ చేసేవారు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రైల్లో గాంధీ గొడవపెట్టుకున్నది ఎవరితో..?
ఇక దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో గాంధీ రైలులోనుంచి బయటకు తోసివేయబడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే భారతదేశంలో ఉన్న పాఠశాలల్లో మాత్రం గాంధీ నల్లజాతీయుడనే రైలు కంపార్ట్మెంట్లో నుంచి బయటకు తోసివేయడం జరిగిందని బోధిస్తున్నారు. కానీ కొందరి వెర్షన్ మరోలా ఉంది. గాంధీజీకి కంపార్ట్మెంట్లో ఉన్న ఆఫ్రికా నల్లజాతీయుల పక్కన కూర్చొనేందుకు చాలా ఇబ్బంది పడ్డారని అందుకే తన సీటును మార్చాలని కోరారని ఓ చరిత్రకారుడు చెప్పారు. దీంతో అధికారి బయటకు తోసేశాడనే వాదన వినిపిస్తున్నారు చరిత్రకారులు. అంతేకాదు శ్వేతజాతీయుల తర్వాత భారతీయులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా గాంధీ అభిమతంగా ఉండేదని చరిత్రకారుడు చెప్పారు. నల్లజాతీయులపైనే ఎప్పుడూ భారతీయులు ఉండాలని కోరుకునేవారని చరిత్రకారులు వివరించారు. భారతీయులను నల్లజాతీయులతో సమానంగా చూడరాదని వారికి శ్వేతజాతీయుల తర్వాత అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే గాంధీ దక్షిణాఫ్రికాలో పోరాటం చేశారని చరిత్రకారులు చెబుతున్నారు.
డర్బన్ పోస్టాఫీసుల్లో ప్రత్యేక ప్రవేశ ద్వారాన్ని ఎందుకు డిమాండ్ చేశారు..?
డర్బన్ పోస్టాఫీసుల్లో శ్వేత జాతీయులకు, నల్లజాతీయులకు రెండు ప్రవేశ ద్వారాలు ఉండేవని ...గాంధీ ఇందుకు ఒప్పుకోలేదని చెప్పారు. గాంధీ భారతీయులకు మూడో ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేశారని ఇక్కడే తనకు నల్లజాతీయులపై ఏపాటి గౌరవం ఉందో తెలుస్తోందని చరిత్రకారులు వివరించారు. అంతేకాదు 1895లో గాంధీజీ ఒక పిటిషన్ వేశారు. బహిరంగ ప్రదేశాల్లో నల్లజాతీయుల పక్కన భారతీయులకు స్థానం కల్పించకూడదని... అలా చేయడం ద్వారా భారతీయులను కూడా చిన్న చూపు చూస్తున్నారని గాంధీజీ తన పిటిషన్లో పేర్కొన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అంతేకాదు భారతీయులు శ్వేతజాతీయుల మూలాలు ఆర్యుల జాతికి చెందినవని తన పిటిషన్లో తెలిపారట గాంధీ. అంతేకాదు నల్లజాతీయులు ఉన్న ప్రాంతాల్లో భారతీయులకు స్థలం కేటాయించడం పై కూడా జోహాన్నెస్ మున్సిపల్ కార్పోరేషన్లో ఫిర్యాదు చేశారు గాంధీ.
అంటరానితనంపై అగ్రకులాల వారిని గాంధీ ఎందుకు ప్రశ్నించలేదు..?
భారతదేశంలో హిందూ మతంపై గాంధీ విధానాలను అంబేడ్కర్ పలుమార్లు ప్రశ్నించారు. దళితులను హిందూ మతానికి చెందిన అగ్రవర్ణాల వారు చిన్న చూపు చూస్తున్నారని పలుమార్లు గాంధీ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని చరిత్రకారులు గుర్తు చేస్తున్నారు. అంటరానితనం గురించి పలు వ్యాసాలు రాసినప్పటికీ... హిందూ మతంలోని అగ్రకులాల ఆధిపత్యం గురించి ఏనాడు ప్రశ్నించేవారు కాదని చరిత్రకారులు చెబుతున్నారు.
ఇక ఘనా యూనివర్శిటీలో గాంధీ విగ్రహాన్ని రెండేళ్ల క్రితం నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. అయితే గాంధీ గురించి నిజాలు తెలుసుకున్న తర్వాత ఘనా ప్రభుత్వం క్యాంపస్ నుంచి గాంధీ విగ్రహం తొలగించి మరో చోట పెడతామని భారత ప్రభుత్వానికి తెలిపింది. అయితే ఇలా ఒక్క ఘనాలోనే జరుగుతున్న తంతు కాదు మలావీలో కూడా గాంధీ విగ్రహాలను తొలగించే పనిలో ఉన్నారు అక్కడి దేశస్తులు.