గౌతమికి షాక్ ఇచ్చిన బిజెపి: ఎందుకు ఆర్కె నగర్కు దూరం?
అర్కె నగర్ నుంచి గౌతమిని బిజెపి ఎందుకు పోటీకి దింపలేదనేది మిస్టరీగానే మిగిలింది. చివరి నిమిషంలో అమరన్ను బరిలోకి దింపి అందరినీ ఆశ్చర్యపరిచింది.
చెన్నై: జయలలిత మరణం వల్ల ఖాళీ అయిన ఆర్కె నగర్ శాసనశభ నియోజకవర్గం నుంచి సినీ నటి గౌతమిని బిజెపి నాయకత్వం పోటీకి దింపుతుందని అందరూ ఊహించారు. కానీ, ఆ ఊహలను బిజెపి తలకిందులు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీని గౌతమి రెండు సార్లు కలవడం, జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ లేఖాస్త్రాలు సంధించడం వంటి కారణాల వల్ల బిజెపి నాయకత్వం ఆమెకు ప్రాధాన్యం ఇస్తుందని భావించారు.
కానీ, చివరకు సీనియర్ సంగీత దర్శకుడు గంగై అమరన్ను బిజెపి నాయకత్వం బరిలోకి దింపింది. ఆయన ఇళయరాజా సోదరుడు కావడం గమనార్హం. అదే సమయంలో తమిళనాడు బిజెపి సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈ కారణాల వల్లనే కాకుండా సామాజిక సమీకరణాల నేపథ్యంలో బిజెపి నాయకత్వం ఆయనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెబుతున్నారు.
అంతేకాకుండా, జయలలిత మృతిపై గౌతమి వ్యక్తం చేసిన అనుమానాలు, డిమాండ్లు ఏ మేరకు ఆ నియోజకవర్గంలో కలిసి వస్తాయనే విషయాన్ని కూడా బిజెపి అంచనా వేయలేకపోయిందని, అది ప్రతికూలంగా కూడా పనిచేసే ప్రమాదం ఉందని భావించిందని అంటున్నారు. దానివల్ల కూడా గౌతమిని పక్కన పెట్టినట్లు సమాచారం.
కాగా, ఆర్కే నగర్ నుంచి అన్నాడియంకె తరఫున ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టిటివీ దినకరన్ పోటీ చేస్తున్నారు. ఆ పార్టీ తిరుగుబాటు వర్గం నుంచి సీనియర్ నేత ఇ. మధుసూదనన్ పోటీకి దిగారు. వీరిద్దరు జయలలిత వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
అదే సమయంలో డిఎంకె కూడా తన అభ్యర్థిని పోటీకి దించింది. ఈ ముగ్గురు పోటీ పడుతున్న నేపథ్యంలో ఓట్లు చీలిపోతాయని, అది తమకు కలిసి వచ్చే అవకాశం ఉందని బిజెపి నాయకత్వం అంచనా వేస్తున్నట్లు సమాచారం.