డేంజరస్ వాట్సాప్ : ఒకే ఒక మెసేజ్...29 మంది ప్రాణాలు తీసింది
Recommended Video
సోషల్ మీడియా విస్తృతం అవుతుండటంతో ఎన్ని లాభాలు ఉన్నాయో అంతకు మించి నష్టాలే కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగదారుడంటూ లేడు. అంతేకాదు తక్కువ రేటుకే డేటా ప్యాకేజీలు టెలికాం సంస్థలు అందిస్తున్నాయి. దీంతో నేరాలు పెచ్చు మీరుతున్నాయి. తాజాగా దేశ వ్యాప్తంగా ఒకే నెలలో 29 మంది మృతి చెందారు.
అవి పరువు హత్యలు కావు, పోనీ రాజకీయ హత్యలు అంతకన్నా కావు, కుల మత హత్యలు అస్సలు కావు, భారత్ పాకిస్తాన్ హత్యలు కావు, బీజేపీ కాంగ్రెస్ మరణాలు కావు, జీహాద్, నక్సలిజం వల్ల సంభవించిన చావులు కావు, లేదా ఆర్ఎస్ఎస్ కశ్మీర్ సమస్యలతో పోయిన ప్రాణాలు కావు. మరి ఈ మరణాలు ఎలా సంభవించాయి...? ఈ మరణాలకు కారణం ఒకే ఒక్క చిన్న వాట్సాప్ మెసేజ్. అవును మీరు చదివింది అక్షరాల నిజమే. ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ 29 మంది ప్రాణాలను బలిగొంది.
ఒక్క తప్పుడు మెసేజ్ ఇంతమంది ప్రాణాలను బలిగొందంటే మీరు నమ్మగలరా... ఇంతకీ ఆ మెసేజ్ సారాంశం ఏమిటంటే చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ మీ నగరాల్లో తిరుగుతున్నారు జాగ్రత్తగా ఉండండి అంటూ పంపిన మెసేజ్. ఈ చిన్న తప్పుడు సందేశం తమిళనాడు నుంచి త్రిపుర వరకు దావణంలా పాకింది. దీంతో ఒక వ్యక్తి కాస్త అనుమానాస్పదంగా కనిపించినా అక్కడి స్థానికులు కొట్టి చంపుతున్నారు.
ఇది పాకిస్తాన్లో షూట్ చేసిన వీడియో
ఈ మెసేజ్తో పాటు ఓ వీడియో కూడా దర్శనం ఇస్తుంది. అందులో ఓ మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ చిన్నపిల్లవాడిని కిడ్నాప్ చేస్తూ కనిపిస్తారు. అయితే ఈ వీడియోను పాకిస్తాన్లోని కరాచీలో చిత్రీకరించారు. చిన్న పిల్లలను కిడ్నాపర్లు ఎలా ఎత్తుకెళతారో స్థానికుల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ఆవీడియోను చిత్రీకరించారు. అయితే మన వాట్సాప్లో వచ్చే వీడియో మాత్రం ఇదే. కానీ చివరకు ఎడిట్ చేసి దాన్ని సర్క్యులేట్ చేశారు కొందరు అల్లరి మూకలు. వీడియోలో చివరకు ఓ సందేశం కనిపిస్తుంది. ఒక్క క్షణంలో పిల్లలను కిడ్నాప్ చేసి దుండగులు పారిపోతున్నారు జాగ్రత్త అంటూ ఓ వ్యక్తి ఫ్లకార్డును ప్రదర్శిస్తాడు. ఈ అసలు దాన్ని తీసేసి వీడియోను వాట్సాప్లో షేర్ చేయడంతో దీని ప్రతిఫలం ఎవరైనా కొత్త వ్యక్తి పరిసరాల్లో కనబడితే చాలు అక్కడి స్థానికులు అతన్ని తీవ్రంగా కొట్టి చంపేస్తున్నారు.
ప్రధాని ఇలాంటి బోగస్ మెసేజ్లపై ఎందుకు స్పందించరు..?
త్రిపురలో ఈ తరహా వార్తలు నమ్మొదంటూ స్థానికుల్లో అవగాహన తీసుకొచ్చేందుకు అక్కడి ప్రభుత్వం ఓ వ్యక్తిని నియమించింది. అవగాహన కల్పించేందుకు గ్రామంలోకి వెళ్లిన ఈ వ్యక్తిని గ్రామస్తులు కొట్టి చంపారు. దీంతో ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బాధ్యతను పోలీసులకు అప్పజెప్పింది. కానీ ఈ టాస్క్ చాలా పెద్దది.అయితే ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగి ఇలాంటి బోగస్ మెసేజ్లను నమ్మి అమాయకుల ప్రాణాలను బలిగొనద్దు అనే ప్రకటన చేస్తే కొంత మార్పు కనిపించే అవకాశం ఉంది. అయితే ప్రధాని ఇలాంటి ప్రకటన ఒకటి చేయాలని ఎవరూ ఆయన దృష్టికి తీసుకురాలేకపోవడం చాలా బాధాకరం. కేంద్ర హోంశాఖ మంత్రి నుంచి ఈ ఘటనలపై ఒక్క ప్రకటన కూడా లేకపోవడం శోచనీయం.
కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ ఏమి చేస్తున్నారు..?
కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇలాంటి తప్పుడు మెసేజ్లు షికారు చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా ఏమి చేస్తున్నారు...? అదే కేంబ్రిడ్జి అనలైటికా డాటా మైనింగ్ స్కామ్పై మాత్రం మార్క్ జుకర్ బర్గ్ భారత్కు వస్తే అరెస్టు చేస్తామనే ప్రకటన చేయడానికి సమయం ఉంటుంది. కానీ దేశంలో తప్పుడు మెసేజ్వల్ల జరుగుతున్న హత్యలపై మాత్రం ఆయన ప్రకటన చేయరని పలువురు విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి మెసేజ్లు ఇంకా ఎందరి ప్రాణాలు తీస్తాయి...?
2017 మే7న ఇలా జార్ఖండ్లో ఓ వ్యక్తిని కొట్టి చంపారు. ఆ తర్వాత 2018 మే 10న తమిళనాడులో ఈ మెసేజ్ వల్ల ఇద్దరు చనిపోయారు. బెంగళూరులో ఒక్కరు, ఏపీ తెలంగాణల్లో 6మంది,అస్సాంలో ఇద్దరు, ఔరంగాబాద్లో ఇద్దరు, మాల్టాలో ఒక్కరు, తూర్పు మిద్నాపూర్లో ఒక్కరు, అహ్మదాబాద్లో యాచించే ఒక వృద్ధురాలు,త్రిపురాలో ఒక్కరోజే ముగ్గురు, మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో 5 మందిని అక్కడి స్థానికులు కొట్టి చంపిన ఘటనలు వెలుగుచూశాయి.
ఇలాంటి తప్పుడు వాట్సాప్ మెసేజ్లు దేశవ్యాప్తంగా ఇంకా ఎంతమందిని పొట్టన బెట్టుకుంటాయని ప్రశ్నిస్తున్నారు మానవతావాదులు. ఇలాంటి మృతుల సంఖ్య 100 దాటక ముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.