చిదంబరం కొంపముంచిన కార్తీ సీఏ డైరీ .. అందులో ఏముందంటే ...
న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో చిదంబరానికి .. ఐఎన్ఎక్స్ ముడుపులకు సంబంధం ఏంటీ అనే ప్రశ్న తలెత్తింది. 2007లో జరిగిన నగదు మళ్లింపునకు సంబంధించి 2017లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆంతర్యం ఏంటీ ? అవకతవకలకు సంబంధించి కేసు నమోదు చేసేందుకు ఇంత సమయం ఎందుకు పట్టిందా ? ఇంతకీ ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నిజ నిజాలేంటీ ? దానికి చిదంబరానికి సంబంధం ఏంటీ ?
చిదంబర రహస్యం ..
కేంద్రంలో 2004లో యూపీఏ సర్కార్ కొలువుదీరింది. ఆ సమయంలో చిదంబరం కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్నారు. అయితే ఎయిర్సెల్ మాక్సిస్ అవినీతికి సంబంధించి దుమారం చెలరేగింది. ఆ సమయంలోనే ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులు (ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్.. ఎఫ్ఐపీబీ) కింద పెట్టారు. ఇవీ మారిషస్కు చెందిన 3 కంపెనీల నుంచి రూ.305 కోట్ల పెట్టుబడులు ఐఎన్ఎక్స్ మీడియాలోకి మళ్లించారు. అయితే ఈ సమయంలో చిదంబరం కుమారుడు కార్తీ రంగంలోకి దిగినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. తన తండ్రి పరపతి ఉపయోగించి అక్రమంగా రూ. 305 కోట్లను మళ్లించినట్లు గుర్తించారు. ఐఎన్ఎక్స్ మీడియాలో నగదు మళ్లింపునకు సంబంధించి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగం (ఎఫ్ఐయూ-ఐఎన్డీ) 2008లో గుర్తించింది. తర్వాత ఈ కేసును ఆదాయపు పన్ను శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు బదిలీ చేసింది.
రంగంలోకి ఈడీ
ఐటీ శాఖ నుంచి కేసు బదిలీ కావడంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులు ఎక్కడినుంచి వచ్చాయనే అంశంపై విచారణ చేపట్టారు. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించారని 2010లో ఈడీ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈ కేసు మరుగనపడిపోయింది. కొన్నేళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఈడీకి లభించాయి. చిదంబరం కుమారుడు కార్తీ సీఏను ఓ కేసులో విచారిస్తుండగా .. ఐఎన్ఎక్స్ మీడియా పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీల విషయం వెలుగులోకి చూసింది. ఆ పత్రాల్లో ఐఎన్ఎక్స్ మీడియాలోకి వచ్చిన నగదు కార్తీతో సంబంధం ఉన్నట్టు రుజువు లభించింది. విదేశీ పెట్టుబడులు పెట్టాలంటే రూ.4.62 కోట్లు మాత్రమే పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఉంది. కానీ ఎఫ్ఐపీబీ కింద రూ.305 కోట్ల పెట్టుబడులు పెట్టడం అనుమానాలకు తావిచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా ఎఫ్ఐపీబీని తమకు అనుకూలంగా మలచుకొని పెట్టుబడులు పెట్టింది.
ఫిబ్రవరిలోనే ఆదేశాలు
ఈ కేసు విచారణ క్రమం ఇలా ఉంటే .. అప్పటి ఆర్థికమంత్రి చిదంబరంపై విచారణ జరుపాలని ఈ ఏడాది ఫిబ్రబరిలో సీబీఐని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ కేసు విచారణను మళ్లీ ఈడీ, సీబీఐ తిరగదోడాయి. ఐఎన్ఎక్స్ మీడియాతోపాటు మరో నాలుగు సంస్థలకు సంబంధించి పెట్టుబడులు ఇదేవిధంగా మళ్లించారా అనే అనుమానం వ్యక్తం చేసింది. ఇందులో ఒకటి ఎయిర్సెల్ మ్యాక్సిస్ కాగా మరో మూడింటిపై కూడా దర్యాప్తు సంస్థలు ఫోకస్ చేశాయి. ఈ కేసుకు సంబంధించి కేంద్రం నుంచి ఆదేశాలు రావడంతో సీబీఐ; ఈడీ చిదంబరం పాత్ర కోణంలో దర్యాప్తు ప్రారంభించాయి.