షాక్:టెక్కీ దిగ్గజాలు వెనక్కి, కారణాలివే
న్యూఢిల్లీ:సిలీకాన్ వ్యాలీలో పనిచేస్తున్న భారతీయ దిగ్గజాలు ఇండియాలో పలు కంపెనీల్లో ఎక్కువ కాలం నిలదొక్కుకోకుండానే మరో చోటుకు చెక్కేస్తున్నారు. దీంతో కొన్ని స్టార్టప్ కంపెనీలు తెరవకుండా మూసివేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా పథకాలకు ఆకర్షితులై స్వదేశీ, విదేశీ ఆన్ లైన్ కంపెనీలు ఎన్నో ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ కు విస్తరించాయి.
కళ్ళు చెదిరే జీత భత్యాలను ఎరగా వేసి సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న భారతీయ దిగ్గజాలను తీసుకొచ్చి పెద్ద పెద్ద పదవుల్లో కూర్చోబెట్టారు.
కానీ, ఈ బాసుల్లో ఎక్కువమంది చాలా కాలంపాటు ఈ కంపెనీల్లో నిలదొక్కుకోకుండానే మరో చోటుకు వెళ్ళిపోయారు. ఫలితంగా కొన్ని స్టార్టప్ కంపెనీలు తెరవకుండానే మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
టెక్కీలు వెనక్కి
ప్లిఫ్ కార్డు నుండి గత ఏడాది నుండి ఏప్రిల్ నెలలో పునీత్ సోని తప్పుకొన్నారు. ఆ తర్వాత మే మాసంలో స్నాప్ డీల్ నుండి చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఆనంద్ చంద్రశేఖరన్ ఏడాది తిరక్కుండానే తప్పుకొన్నారు. 2014 లో ఫేస్ బుక్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నమితా గుప్తా, రెస్టారెంట్ లిస్టింగ్ స్టార్టప్ కంపెనీ జోమాతో నుండి ఏడాది తిరక్కుండానే తప్పుకొన్నారు.గతంలో లింక్డ్ఇన్ ఇండియాలో హెడ్ గా పనిచేసిన నిశాంత్ రావు చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రెష్ డెస్క్ స్టార్టప్ కంపెనీ నుండి వారం క్రితమే తప్పుకొన్నారు.
టెక్కీలు ఎందుకు వెనక్కి వెళ్తున్నారు
ఒకప్పుడు సిలికాన్ వ్యాలీలో ఓ వెలుగు వెలిగిన ఈ దిగ్గజాలు ఈ మాతృదేశంలోని కంపెనీల్లో ఎందుకు నిలదొక్కుకోలేకపోతున్నారు, ఎక్కువ జీతాలకు ఆశపడిపోతున్నారా, కంపెనీ వాతావరణం నచ్చడం లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే అంశాలపై చర్చ సాగుతోంది.అమెరికాలోని సిలికాన్ వ్యాలీలోని స్థానిక వ్యాపార కంపెనీలు మార్కెట్ పైనా, వచ్చే లాభాలపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తే భారత్ కు వచ్చే స్టార్టప్ కంపెనీలు అంకెల మీద, మార్కెట్ లో వాటా మీద దృష్టిని కేంద్రికరించడం ప్రధాన లోపమని స్టాంటన్ చేజ్ కంపెనీ మేనేజింగ్ పార్ట్ నర్ కెఎన్ శ్రీపాద తెలిపారు.
అంకెల ఆధారంగా మార్కెట్ అంచనాలు
భారత్ లో 40 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారని, వందకోట్ల మంది సెలో ఫోన్లను వాడుతున్నారన్న అంకెల ఆధారంగా మార్కెట్ ను అంచనా వేస్తున్నారని శ్రీపాద వివరించారు.సిలికాన్ వ్యాలీలో , భారత్ లో బయటి నుండి నుంచి చూస్తే సృజనాత్మకత ఒకటిగానే కన్పిస్తోంది, కాని క్షేత్ర స్థాయిలో తేడాలున్నాయని, ఆ తేడాల వల్లే స్టార్టప్ కంపెనీల్లో ఎక్కువమంది నిలదొక్కుకోలేకపోతున్నారని హైడ్రిక్ అండ్ స్ట్రగుల్స్ ఇంచార్జ్ పార్ట్ నర్ వెంకట్ శాస్త్రీ తెలిపారు.
సిలికాన్ వ్యాలీలో అనుభవం ఉన్నవారెక్కువ
సిలికాన్ వ్యాలీలో అనుభవం ఉన్న సీనియర్లు దొరికే వారని, వారి అనుభవం ఇక్కడి వారికి లేదన్నారు శాస్త్రీ,సిలికాన్ వ్యాలీలో మార్కెట్ పరిణతి చెందిందన్నారు. ఏ రంగానికి ప్రాముఖ్యత ఉందో ఏ రంగాల్లో రాణించాలో మార్గనిర్థేశం చేసేవారు సిలికాన్ వ్యాలీలో ఎక్కువని ఆయన అభిప్రాయపడ్డారు.
పని చేసే చోట వాతావరణం సరిగా లేకపోవడం
భారత్ లో ఉన్న కంపెనీల్లో వాతావరణం సరిగా లేకపోవడం కూడ ప్రధానంగా టెక్కీ దిగ్గజాలు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడానికి ప్రధాన కారణమనరే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.ఉద్యోగుల మధ్య సఖ్యత, స్నేహభావం లేకపోవడం , పని సంస్కృతి నచ్చకపోవడమే తాము భారత స్టార్టప్ కంపెనీల నుండి తప్పుకోవడానికి ప్రధాన కారణమని నెట్ దిగ్గజాలు చెబుతున్నారు.
టాలెంట్ ను పట్టించుకోకపోవడం ఇబ్బందే
అమెరికాలోని టాలెంట్ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు, భారత్ లో బంధు, మిత్రుల సంబంధాల కారణంగా అర్హత లేకున్నా ఉద్యోగాలు పొందుతున్నారని, దీని కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయని టెక్కీలు అభిప్రాయపడుతున్నారు.
పనివేళలు కూడ కారణం
సిలికాన్ వ్యాలీలో ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం వరకు పనివేళలుంటాయి. వారంతంలో రెండు రోజుల పాటు సెలవులుంటాయి. కాని, భారత్ లో పనివేళలు ఎక్కువ కావడమే కాకుండా ఎక్కువగా విదేశీ కస్టమర్ల కోసం రాత్రిళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. స్టార్టప్ కంపెనీలవడం వల్ల కూడ పని ఎక్కువగా ఉంటోంది.కొన్నిరంగాల్లోనే ఎక్కువ స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయడం కూడ భారత్ లో చేసిన పొరపాటని, దీని వల్ల కంపెనీల మధ్య అనవసరమైన పోటీ పెరిగి మూసివేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.