కాంగ్రెస్ అర్బన్ నక్సల్స్ను ఎందుకు వెనుకేసుకొస్తోంది..?: బస్తర్ ప్రచారంలో ప్రధాని మోడీ
బస్తర్ : ఛత్తీస్గడ్ రాష్ట్రంలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఆరాష్ట్రం బీజేపీ కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారంతో హోరెత్తిపోతోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తొలిసారిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ కాంగ్రెస్ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పట్టణ మావోయిస్టులను ఎందుకు వెనకేసుకొస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అర్బన్ మావోయిస్టులు ఏసీ గదుల్లో ఉంటూ, పెద్ద కార్లలో తిరుగుతూ వారి పిల్లలను విదేశాల్లో చదివిస్తూ ఇక్కడి పేద ఆదివాసీల జీవితాలను మాత్రం కృంగదీస్తున్నారని చెప్పారు. అలాంటి వారకి కాంగ్రెస్ ఎందుకు మద్దతిస్తోందని ప్రశ్నించారు.
చత్తీస్గఢ్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడపాలన్న అటల్ బిహారీ వాజ్పేయి స్వప్నం నెరవేర్చేవరకు తాను విశ్రాంతి తీసుకోబోనని మోడీ హామీ ఇచ్చారు. బస్తర్ జిల్లాలో ప్రసంగించిన మోడీ అక్కడి కాంగ్రెస్కు గట్టి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓవైపు పట్టణప్రాంతాల్లోని మావోయిస్టుల సానుభూతి పరులకు మద్దతు ఇస్తూనే మరోవైపు ఛత్తీస్గఢ్ను మావోల నుంచి విముక్తి కలిగించాలని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నసమయంలో మావోయిస్టుల ప్రభావం ఉన్న బస్తర్ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని గుర్తుచేశారు.
దళితులను, వెనకబడిన వర్గాలను, పేద ప్రజలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటుబ్యాంకులానే చూస్తుందని వారిపట్ల హస్తం పార్టీకి నిజమైన ప్రేమలేదని అన్నారు మోడీ. ఇక ఛత్తీస్గడ్కు దేశనలుమూలల నుంచి యువత ఉద్యోగాల కోసం తరలి వస్తారని ఆ రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని చెప్పారు. తమ ప్రభుత్వం 9వేల గ్రామాలను అనుసంధానం చేసిందని చెప్పిన ప్రధాని మోడీ... రూ.35వేల కోట్లతో జాతీయరహదారుల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. భారతీయ జనతా పార్టీ మనుషులను వారి కులం ప్రాతిపదికన వేరు చేసి చూడదని .... కేవలం అభివృద్ధిని మాత్రమే నమ్ముకుంటుందని చెప్పారు.