థర్డ్ ఫ్రంట్ అంశంలో మమతా బెనర్జీ స్వరం ఎందుకు మారుతోంది..? కారణం కేసీఆర్ ప్రభావమేనా..?
హైదరాబాద్ : బీజేపికి వ్యతిరేకంగా సేవ్ నేషన్, సేవ్ డెమాక్రసీ పేరుతో ఏర్పాటైన జాతీయ ప్రతిపక్షాల కూటమి ఆదిలోనే కుదుపుకు లోనవుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు ముందుండి కూటమికి సారథ్యం విహిస్తున్నప్పటికి అందులో కీలక నేతగా ఉన్న మమతా బెనర్జీ మాత్రం కూటమికి ఎప్పుడు దూరం అవుతారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపిని వ్యతిరేకిస్తున్న మమత కాంగ్రెస్ పార్టీతో అంత మనస్పూర్తిగా వెళ్లడం లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి.
అటు కాంగ్రెస్ కాకుండా ఇటు బీజేపి లేకుండా మరో రాజకీయ శక్తి ఆవిర్భవించాల్సిన ఆవశ్యకత ఉందని ఆమె విశ్వశిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం కాంగ్రెస్, బీజేపి కాకుండా మరో ప్రత్యామ్నాయ పార్టీ దేశానికి అవసరం అంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో ఏకీభవిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. అదే నిజమయితే చంద్రశేఖర్ రావు, మమత బెనర్జీ కలిసి కొత్త ఫ్రంట్ కు రూపకల్పన చేసే అవకాశాలు లేకపోలేదనే చర్చలు జరుగుతున్నాయి.
బీజేపికి ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్..! ఆదిలోనే హంసపాదు..!
తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో గత అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి విజయబావుటా ఎగురవేసింది. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ప్రజాకూటమిని చిత్తు చిత్తుగా ఓడించి రాష్ట్రంలోని 119 స్థానాలకు గానూ 88 చోట్ల కారు దూసుకుపోయింది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు ఆ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అనే కొత్త పదవిని సృష్టించి, ఆయన కుమారుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు బాధ్యతలు అప్పగించారు.
థర్డ్ ఫ్రంట్ లో కీలక భూమిక పోషించిన మమత..! మెల్లగా స్వరం మార్చుతున్న దీదీ..!!
జాతీయ రాజకీయాలపై దృష్టి సారించేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. వాస్తవానికి ఆయన జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని కొంత కాలంగా చెప్పుకొస్తున్నారు. అంతేకాదు, భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అయితే, కొద్దిరోజులు ఈ విషయాన్ని పక్కనపెట్టేసిన ఆయన తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి దీనిని తెరపైకి తీసుకు వచ్చారు. దీంతో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
మూడూ రాష్ట్రాల్లో గెలిచినా సోనియాను అభినందించని మమతా..! కలిసి ఎట్టా ముందుకు పోయేది..!!
తాజాగా తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆమె ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ను అభినందించకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలవరపాటుకు గురి చేస్తుందట.
కేసీఆర్ వ్యాఖ్యల ప్రభావం..! త్వరలో మమత, కేసీఆర్ భేటీ ఉండే అవకాశం..!!
కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలోని పలు పార్టీలతో కలిసి ఏర్పడబోతున్న బీజేపీయేతర కూటమిలో భాగస్వామి అయిన మమతకు కాంగ్రెస్ విజయం మింగుడు పడడం లేదని తెలిసింది. ఇప్పుడు ఈమె కూటమి ఏర్పాటు చేస్తారా..? లేక కేసీఆర్ ఏర్పాటు చేయబోయే ఫ్రంట్లో చేరుతారా అనేది చర్చనీయాశం అయింది. అయితే, కేసీఆర్.. మమత ఇద్దరూ ప్రధాన మంత్రి రేసులో ఉన్నవారేనని ఈ కారణంగా వీరిరువురూ జతకట్టే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ వీళ్లిద్దరూ కలిసి పని చేసినా.. విడివిడిగా పని చేసినా ఎన్డీయేకే ప్రయోజనం కలుగుతుందని కూడా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రశేఖర్ రావు, మమత బెనర్జీల ఫ్రంట్ అంశం పట్ల ఎలాంటి పరిణామలు చోటు చేసుకుంటాయోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.