అమిత్ షా వ్యాఖ్యలపై మోడీ మౌనం వెనుక రహస్యమేమిటి: ఎయిర్ స్ట్రైక్స్పై మాయావతి
లక్నో: పుల్వామా దాడి అనంతరం, పాక్ భూభాగంలోకి వెళ్లి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన సర్జికల్ స్ట్రైక్ 2 (ఎయిర్ స్ట్రైక్)లో 250 మంది తీవ్రవాదులు మృతి చెందారని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా చెప్పారని, దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా ఎందుకు ఉన్నారో చెప్పాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రశ్నించారు.
పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్లో జరిగిన ఎయిర్ స్ట్రైక్లో 250 మందికి పైగా మృతి చెందారని అమిత్ షా పదేపదే చెబుతున్నారని, కానీ ఆయన గురువు అయిన ప్రధాని మోడీ దీనిపై మాట్లాడటం లేదని మండిపడ్డారు. ప్రతి విషయంలోను తాను క్రెడిట్ తీసుకునే మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని నిలదీశారు. తీవ్రవాదులు చనిపోవడం నిజంగా శుభవార్తేనని, కానీ ప్రధాని మౌనంగా ఉండటం వెనుక గల రహస్యం ఏమిటో చెప్పాలని నిలదీశారు.
భారత్లో మరిన్ని దాడులు..ఈ సారి ఉగ్రవాదులు ఎలా దాడి చేస్తారో తెలుసా..?
అమిత్ షా అలహాబాద్లో మాట్లాడుతూ... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ స్ట్రైక్లో 250 మంది వరకు జైష్ ఎ మహ్మద్ తీవ్రవాదులు చనిపోయారని చెప్పారు. దీనిపై ప్రధాని మోడీ పెదవి విప్పాలని మాయావతి డిమాండ్ చేశారు.
బీజేపీ ఆర్థిక విధానాల పైన కూడా మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ఆర్థిక వృద్ధి రేటుకు అనుగుణంగా పేదలకు, రైతులకు, లేబర్స్కు దాని ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.