రాహుల్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహిళా నేతపై వేటు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శించిన ఆ పార్టీ ఢిల్లీ మహిళా నాయకురాలు బర్ఖా శుక్లాసింగ్ ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించినట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఢిల్లీ మహిళా నాయకురాలు బర్ఖా శుక్లాసింగ్ పై వేటు పడింది. ఆమెను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించినట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
ఢిల్లీ మహిళా కాంగ్రెస్ విభాగానికి బర్ఖాసింగ్ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇటీవల రాహుల్ గాంధీపై ఈమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను నడిపించే నాయకత్వ లక్షణాలు రాహుల్ గాంధీలో లేవని, అధ్యక్షుడి బాధ్యతలకు ఆయన సరిపోరంటూ ఆమె వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ పై కూడా బర్ఖాసింగ్ విమర్శలు చేశారు. పార్టీ మహిళా నేతలతో అజయ్ అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. దీనిపై రాహుల్ గాంధీ సహా పార్టీ సీనియర్ నేతలకు ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోలేదంటూ విమర్శలు గుప్పించారు.
బర్ఖాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంది. క్రమశిక్షణ చర్యల కింద ఆమెను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించేందుకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి అర్వీందర్ సింగ్ లవ్లీ కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు రెండు రోజుల్లో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి తరుణంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై వేటు పడడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సి ఉంది.