మోడీని నిలదీస్తారా: శివసేనకు అసద్, సిద్ధయ్య చనిపోతే రాలేదేం!
హైదరాబాద్: ముస్లిం మతం తరచుగా ఓటు బ్యాంకు రాజకీయాలకు గరువుతోందని, ఆ మతస్థులకు ఉన్న ఓటు హక్కును ఉపసంహరించుకోవాలన్న శివసేన వ్యాఖ్యల పైన మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీని తన కేబినెట్ నుండి మైనార్టీలు అయిన నజ్మా హెఫ్తుల్లా, ముక్తార్ అబ్బాస్ నక్వీలను తొలగించాలని శివసేన డిమాండ్ చేయగలదా అని ప్రశ్నించారు.
పాకిస్తాన్ ముంబై పేలుళ్ల కుట్రదారు జకీవుర్ రెహ్మాన్ లఖ్వీని విడుదల చేసిందని, దీనిపై శివసేన ఎందుకు నిరసన తెలపడం లేదని ప్రశ్నించింది. అలాగే, మరాట్వాడాలో రైతుల మృతి పైన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగుల పక్షాన ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. శివసేన మా గురించి మాట్లాడకుంటా తమ రాష్ట్రం పైన దృష్టి సారిస్తే మంచిదన్నారు.
సిద్ధయ్య చనిపోతే ఎందుకెళ్లలేదు?: బీజేపీ
ఆలేరు - జనగామలో జరిగిన ఎన్కౌంటర్లో వికారుద్దీన్, అతడి అనుచరులు మృతిచెందితే ముస్లిం మతపెద్దలతో ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి ఎన్కౌంటర్పై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేసిన అసదుద్దీన్... ఉగ్రవాదులతో పోరాడి బలైన ఎస్సై మహ్మద్ సిద్దిఖ్ అలియాస్ సిద్ధయ్యను, ఆయన కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదో సమాధానం చెప్పాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ బి పండరి ప్రశ్నించారు.
నాలుగు రోజులు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడిన సిద్ధయ్యను ముస్లింలకు తామే ప్రతినిధులమని ప్రగల్బాలు పలికే అసదుద్దీన్ గానీ, మజ్లిస్ ఎమ్మెల్యేలుగాని, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీగాని పరామర్శించలేదన్నారు.