అపర చాణక్యుడే .. ’షా‘ ను మించిన శిష్యుడే : జేపీ నడ్డా ప్రొఫైల్
న్యూఢిల్లీ : బీజేపీ చీఫ్ అమిత్ షా నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చేరారు. ఇక ఇన్నాళ్లు తన భుజాలపై మోస్తున్న బీజేపీ అధ్యక్ష పదవీ కట్టబెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మాజీ కేంద్రమంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా పేరు దాదాపు ఎంపికైంది. అయితే అమిత్ షా లాగా నడ్డా చాణక్యం ప్రదర్శించగలడా ? 303 సీట్లు సాధించిన బీజేపీ ప్రభ మరింత ఇనుమడింపజేయగలడా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇంతకీ నడ్డా ప్రత్యేకతలేంటీ ? ఆయన వ్యుహాలు ఎలా ఉండబోతున్నాయి ? అనే అంశాలను ఓసారి విశ్లేషిద్దాం.
లో ప్రొఫైల్ ...
బీజేపీ చీఫ్ పదవీ కోసం నడ్డాతోపాటు దర్మేంద్ర ప్రదాన్ పేరు కూడా వినిపించింది. అయితే మోదీ క్యాబినెట్లో దర్మేంద్ర ప్రదాన్ చేరడంతో .. ఇక నడ్డా పేరు ఖరారవనుంది. మోడీ తొలి క్యాబినెట్లో పనిచేశారు నడ్డా. కానీ ప్రభుత్వంలో మాత్రం లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టి .. దేశంలో వైద్య కొరత ప్రజలు ఇబ్బంది పడకూడదని భావించారు. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్ .. నిధులు కూడా ఎక్కువే కేటాయించింది. ఇదే కాదు .. ప్రభుత్వంలో కీ రోల్ పోషించినా .. తన పేరు ఎక్కడ వినిపించకున్నా పెద్దగా లెక్కచేయలేదు. అందుకే నడ్డా అంటే ఎక్కువమందికి తెలియదు.
సామర్థ్యం తెలిసిందిలా ..
ఇటీవల జరిగిన ఎన్నికల్లో మోడీ-షా ద్వయం సమిష్టిగా పనిచేసింది. అధికారంలోకి మళ్లీ వచ్చేందుకు కష్టపడింది. బీజేపీ సారథి కీలకమైన యూపీపై ఫోకస్ చేశారు. ఆ రాష్ట్ర బాధ్యతలను జేపీ నడ్డాకు అప్పగించారు. రాష్ట్రంలో 50 శాతం ఓట్లు బీజేపీకి పడాలని కండీషన్ పెట్టారు. షా పెట్టిన షరతుకు తగినట్టు నడ్డా పనిచేశారు. 50 అంటే 49.6 శాతం ఓటు షేర్ బీజేపీకి వచ్చింది. దీంతో 62 స్థానాల్లో కమలం వికసించింది. మెజార్టీ స్థానాల కోసం పొత్తు పెట్టుకున్న మాయావతి, అఖిలేశ్ చిత్తయ్యారు. ఇదీ నడ్డా వ్యుహం, చతురత గురించి ఇటీవల జరిగిన ఓ పరిణామం.
బీహర్ టు హిమాచల్ ప్రదేశ్
జేపీ నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. కానీ ఆయన జన్మించింది మాత్రం బీహర్లో .. బ్రహ్మిన్ కులానికి చెందిన జగత్ ప్రకాశ్ నడ్డా సెయింట్ గ్జేవియర్ స్కూల్లో సెకండరీ విద్య, పాట్నా వర్సిటీలో ఎల్ఎల్బీ చేశారు. పాట్నా వర్సిటీలోని రాజకీయాలపై ఆయనకు ఆసక్తి ఏర్పడింది. 1997లో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో గెలుపొందారు. ఆ సమయంలో జయప్రకాశ్ నారాయణ ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. తర్వాత ఆయన బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీలో చేరారు. 1984లో ఏబీవీపీ విద్యార్థి విభాగం .. ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగాన్ని కూడా ఓడించారు. వర్సిటీలో తొలిసారి ఏబీవీపీ విజయం సాధించడంలో నడ్డా కీ రోల్ పోషించారు. తర్వాత 1986 నుంచి 1989 వరకు ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1991లో భారతీయ జనతా యువ మెర్చా అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు. 1993లో హిమాచల్ ప్రదేశ్ నుంచి అసెంబ్లీకి ఎన్నికై రాజకీయ తెరంగ్రేటం చేశారు. 1998, 2007లో కూడా అసెంబ్లీకి విజయవంతంగా ఎన్నికయ్యారు నడ్డా. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2010లో మాత్రం ప్రేమ్ కుమార్ ధుమాల్ ప్రభుత్వం నుంచి తనకుతానుగా తప్పుకున్నారు. సీఎంతో విభేదాలు రావడంతో మంత్రి పదవీ నుంచి స్వయంగా తప్పుకున్నారు. తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ పిలుపుతో జాతీయ రాజకీయాల్లోకి అడుగిడారు. అయితే హిమాచల్ రాజకీయాల్లో క్రమంగా ప్రేమ్ కుమార్ ధుమాల్ దూరమైన .. అతని కుమారుడు అనురాగ్ ఠాకూర్ మాత్రం తెరపైకి వచ్చారు. కానీ ఇప్పుడు మోడీ క్యాబినెట్లో అనురాగా ఠాకూర్ చేరగా ... బీజేపీ చీఫ్గా నడ్డా బాధ్యతలు స్వీకరించనున్నారు.
రాజకీయ చాణక్యుడే ..
2012లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్న నడ్డా .. అక్కడినుంచే రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014లో మోడీ కోసం అమిత్ షా మాదిరిగానే నడ్డా కూడా క్షేత్రస్థాయిలో పనిచేశారు. ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా వ్యుహలు పన్ని .. బీజేపీ అధికారం చేపట్టడంలో కీ రోల్ పోషించారు. వాస్తవానికి రాజ్నాథ్ సింగ్ తర్వాత నడ్డా .. బీజేపీ చీఫ్గా పేరు వినిపించినా .. అనుహ్యంగా అమిత్ షా తెరపైకి వచ్చారు. రాజ్నాథ్ కేంద్రమంత్రివర్గంలో చేరడంతో .. పార్టీ చీఫ్గా అమిత్ షా పగ్గాలు చేపట్టారు. తర్వాత 2014లో మహారాష్ట్ర ఎన్నికల బాధ్యతలను నడ్డాకు అప్పగించారు. అనుకున్నట్టుగానే బీజేపీ విజయంలో నడ్డా కీ రోల్ పోషించారు. తర్వాత హర్షవర్థన్ స్థానంలో కేంద్రమంత్రి పదవీ అప్పగించారు మోడీ. ఇప్పుడు షా .. క్యాబినెట్లోకి వెళ్లడంతో బీజేపీ రథసారథి పగ్గాలు చేపట్టబోతున్నారు.