ఒక్క వీర్ సావర్కర్ కే ఏం ఖర్మ..గాడ్సేకు కూడా భారత రత్న ఇచ్చేయండి: బీజేపీపై ఒవైసీ గరం
ముంబై: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, హిందూ మహాసభ వ్యవస్థాపకుడు వీర్ సావర్కర్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డును అందజేయాలంటూ భారతీయ జనతాపార్టీ చేస్తోన్న డిమాండ్ పట్ల అఖిల భారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. లౌకికవాద దేశంగా ఉన్న భారత్ లో హిందు మహాసభ వంటి వివాదాస్పద సంస్థలకు ఆద్యుడైన వీర్ సావర్కర్ కు భారత రత్న కోసం డిమాండ్ చేయడంలో అర్థం లేదని అన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఒవైసీ విస్తృతంగా పాల్గొంటున్నారు. మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 44 సీట్లలో మజ్లిస్ పోటీ చేస్తోంది. ముస్లిం, మైనారిటీల ఓటు బ్యాంకు అధికంగా ఉన్న 44 చోట్ల అభ్యర్థులను నిలబెట్టింది. తమ అభ్యర్థుల గెలుపు కోసం ఒవైసీ ఆయా చోట్ల ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఔరంగాబాద్ లో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు.
భారత రత్న అంశాన్ని కూడా బీజేపీ ఎన్నికల ప్రచారంలో వాడుకుంటోందని ధ్వజమెత్తారు. మహారాష్ట్రీయుడైన వీర్ సావర్కర్ కు భారత రత్న ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని విమర్శించారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే ఈ విషయాన్ని ప్రస్తావించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వీర్ సావర్కర్ కు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలన్న బీజేపీ డిమాండ్ ను కాంగ్రెస్ తప్పు పట్టుతోందంటూ అకోలాలో నిర్వహించిన బహిరంగ సభ సందర్భంగా నరేంద్ర మోడీ విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై ఒవైసీ ఆరోపణలు గుప్పించారు.
బీజేపీ తీరు చూస్తోంటే మహారాష్ట్రలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే వీర్ సావర్కర్ కు భారత రత్న పురస్కారాన్ని ప్రకటించేలా కనిపిస్తోందని అన్నారు. వీర్ సావర్కర్ కే ఎందుకు? జాతిపిత మహాత్మా గాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేకు కూడా భారత రత్న ఇస్తే ఓ పనైపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. భారత ప్రజాస్వామ్య పునాదులను బలహీన పరిచే కుట్రకు బీజేపీ తెర తీసిందని ధ్వజమెత్తారు. లౌకికవాదం అనే పునాదులపై నిర్మితమైన భారత ప్రజాస్వామ్యాన్ని నేలమట్టం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగలాల్సిన అవసరం ఉందని చెప్పారు.