మెరీనా బీచ్-కరుణ అంత్యక్రియలు: ఎందుకు అంత ప్రతిష్టాత్మకం, పట్టు?
చెన్నై: డీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి మెరీనా బీచ్లో అంత్యక్రియల విషయమై డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వం మధ్య రగడ చోటు చేసుకుంది. చివరకు మద్రాసు హైకోర్టు జోక్యంతో మెరీనాలోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మెరీనా బీచ్ పైన అంత పట్టు ఎందుకు అనే ప్రశ్న ఉదయిస్తుంది.
Recommended Video
ఎవరీ కరుణానిధి? ఇదీ రాజకీయ నేపథ్యం-ఎన్నో రికార్డ్లు: కీలక అంశాలు
మెరీనా బీచ్ పక్కన కేవలం ముఖ్యమంత్రులకే అంత్యక్రియలు జరిగాయని, మాజీ ముఖ్యమంత్రులకు జరగలేదని, పైగా స్వయంగా కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాజీలకు మరోచోటు చూపించారని ప్రభుత్వం వాదించింది. అయితే హైకోర్టు ఆదేశాలతో చివరకు మెరీనాలోనే అంత్యక్రియలు జరిగాయి.
జయకు నో, కరుణ కోసం వెనక్కి: మెరినా బీచ్లో అంత్యక్రియలపై ఏం జరిగిందంటే?
మెరీనా బీచ్లో రాజకీయ ప్రముఖుల మెమోరియల్స్
మెరీనా బీచ్ పక్కన అన్నాదురై, ఎంజీ రామచంద్రన్, జయలలితల మెమోరియల్స్ ఉన్నాయి. వారు ముగ్గురు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు చనిపోయారు. మాజీ ముఖ్యమంత్రులైన కామరాజ్, రాజాజీ స్మారక కేంద్రాలు గూండిలోని గాంధీ మండపంలో నిర్మించారు. కాబట్టి మాజీ సీఎం అయిన కరుణ సమాధికి కూడా అక్కడే స్థలం కేటాయిస్తామని పళని ప్రభుత్వం తెలిపింది. ఈ మెరీనా బీచ్ ద్రవిడ రాజకీయ ప్రముఖులకు కూడా శాశ్వత విశ్రాంతి స్థలం. ద్రవిడ ఉద్యమానికి ఊపిరిలూదిన, ద్రవిడ కజగంను స్థాపించిన పెరియార్ మెమోరియల్ మరోచోట ఉంది.
ఆ ప్రముఖుల సరసన కరుణానిధి
అన్నాదురై చరిత్ర చెప్పాలంటే కరుణానిధి పేరు కచ్చితంగా రావాల్సిందే. అలాగే ఎంజీఆర్ చరిత్ర చెప్పాలంటే కరుణానిధి, జయలలితల పేర్లు రావాల్సిందే. మెరీనా బీచ్లో అన్నాదురై మెమోరియల్కు కుడి పక్కన కొద్ది దూరంలో ఎంజీఆర్ మెమోరియల్ ఉంది. ఎంజీఆర్ మెమోరియల్కు కొద్ది దూరంలో జయలలిత మెమోరియల్ ఉంది. మెరీనాలోని అదే ప్రముఖుల సరసన చేరాలని కరుణానిధి కూడా భావించి ఉంటారు. అందుకే తాను సీఎంగా ఉండగానే చనిపోవాలని కోరుకున్నారని అంటారు. ఆ కోరిక నెరవేరలేదు. కానీ మెరీనా కోరిక మాత్రం నెవేరింది.
భావోద్వేగాలకు ప్రతీక
మెరీనా నాయకుల రాజకీయ భావోద్వేగాలకు నిదర్శనంగా నిలిచిందని అంటున్నారు. ఎందుకంటే గతంలో మాజీ ముఖ్యమంత్రుల అంత్యక్రియలు మెరీనాలో నిర్వహించేందుకు కరుణానిధి కూడా అంగీకరించలేదని, సీఎంగా ఉన్నప్పుడు వారికి మరోచోటు ఇచ్చారని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు చనిపోయినప్పటికీ ఆమె మెమోరియల్ మెరీనాలో ఉండవద్దంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు కరుణ విషయంలో పళని ప్రభుత్వం అలాగే వ్యవహరించింది. మెరీనా బీచ్ నాయకుల శాశ్వత విశ్రాంతికి కీలకంగా మారిందని, ఆయా పార్టీలు లేదా ఆయా నేతలు లేదా అభిమానులు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని మరోసారి తేలిందని చెబుతున్నారు.
మెరీనా బీచ్లో నిర్మాణం చేపట్టాలంటే?
మెరీనా బీచ్లో నిర్మాణం అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేరు. ఒకవేళ చేపట్టాలన్నా సీసీఎంసీ యాక్టులోని సెక్షన్ 319 ప్రకారం కమిషనర్ నుంచి లైసెన్స్ పొందారు. 2016 డిసెంబరులో జయలలిత మృతి చెందినప్పుడు మెరీనా బీచ్లోని కొంత భాగాన్ని స్మశాన వాటికకు కేటాయించింది చెన్నై కార్పోరేషన్.
ఖననం ఎందుకు?
జయలలిత, కరుణానిధి ద్రవిడ ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టి వారిని దహనం చేయడం లేదు. జయలలిత కూడా ద్రవిడ పార్టీ నాయకురాలే. కరుణానిధి అంతే. సంప్రదాయ పద్ధతులకు వారు దూరం. వీరికంటే ముందు ద్రవిడ ఉద్యమ నేత ఎంజీ రామచంద్రన్ను కూడా ఖననం చేశారు.