అయ్యప్ప యాత్రలో ప్రత్యేకంగా మారుతున్న సెయింట్ బసిలికా చర్చి..?
కేరళలో ఈ చర్చి ప్రసిద్ధి గాంచింది. ప్రపంచ నలుమూలల నుంచి ఈ చర్చిలో ప్రార్థనలు చేసేందుకు భక్తులు తరలివస్తారు. క్రైస్తవులు చర్చికి వచ్చి ప్రార్థనలు చేయడం సహజమే. అదే కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చి దర్శనం తర్వాత నేరుగా ఈ చర్చికి వచ్చి ప్రార్థనలు చేస్తున్నవారు కూడా ఉన్నారు. అక్కడ పూజలు చేసి ఇక్కడ ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారు.. ఇదే చర్చికే ఎందుకు వస్తున్నారు.. ఈ చర్చి మహత్యం ఏమిటి..?
16వ శతాబ్దంలో సెయింట్ ఆండ్రూస్ బసలిక చర్చి నిర్మాణం
సెయింట్ ఆండ్రూస్ బసిలికా చర్చి... కేరళలోని అర్తున్కల్లో ఉన్న ప్రముఖ చర్చి. సెయింట్ సెబాస్టియన్కు ఈ చర్చిని అంకితం చేశారు. సెయింట్ సెబాస్టియన్కు అంకితం ఇచ్చిన చర్చిల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇదే అతిపెద్ద చర్చి. 16వ శతాబ్దంలో పోర్చగీస్ వారు ఈ చర్చిని నిర్మించారు. ఆ చర్చిలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవారు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తే ఆరోగ్యం బాగుపడుతుందని చాలామంది విశ్వసిస్తారు. అంతేకాదు శబరిమల నుంచి తిరిగి వెళ్లే సమయంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటివి జరగకుండా తిరిగి తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాలంటూ ఈ చర్చిలో అయ్యప్ప భక్తులు ప్రార్థనలు చేయడం విశేషం. ప్రతి ఏటా జనవరి 10వ తేదీన ఈ చర్చిలో జరిగే పండుగకు దక్షిణ భారతం నుంచి క్రైస్తవులు, క్రైస్తవేతరులు కూడా భారీ సంఖ్యలో వచ్చి ప్రార్థనల్లో పాల్గొంటారు.
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సెయింట్ సెబాస్టియన్ విగ్రహ దర్శనం
ఈ చర్చిలోని సెయింట్ సెబాస్టియన్ విగ్రహంను ఇటలీ దేశంలోని మిలాన్ నగరంలో 1647లో చెక్కారు. బాణాలతో కుచ్చినట్లుగా ఉండే ఈ విగ్రహం ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనమిస్తుంది. మిగతా రోజులు ఈ విగ్రహం ఎవరి కంట పడకుండా దాచి ఉంచుతారు. సెయింట్ సెబాస్టియన్ క్రైస్తవుడని తెలుసుకుని రోమన్ చక్రవర్తి ఆదేశాల మేరకు ఆయనపై బాణాలు సంధించి చంపేశారని చరిత్ర చెబుతోంది. ఇక ఏటా జరిగే పండుగ సమయంలో ఈ విగ్రహం ఒక గాజు పెట్టెలో ఉంచి ఊరేగింపుగా తీసుకొస్తారు. చర్చి ఆవరణ నుంచి వెనకాలే ఉన్న బీచ్ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి ఆ తర్వాత తిరిగి చర్చిలోకి తీసుకొస్తారు. ప్రతి ఏటా ఆ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళుతున్న సమయంలో ఆకాశంలో ఓ గద్ద ఎగురుతూ కనిపిస్తుందట. ఊరేగింపు జరిగేవరకు ఆ గద్ద ఆ ఊరేగింపు వెంటే ఎగురుతుందట. ఊరేగింపు సమయంలో భక్తులు పొర్లుదండాలు పెడుతారు. ఈ పద్ధతిని ఉరలల్ నెర్చ అని పిలుస్తారు. ఈ పండగ సమయంలో భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తారు.
11 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు
ఇక ఈ ఉత్సవాలు 11 రోజుల పాటు జరుగుతాయి. ఆ సమయంలో చుట్టు పక్కల చాలా దుకాణాలు వెలుస్తాయి. ఆ దుకాణాల్లో రకరకాల మిఠాయిలు,ఆహారం, డ్రింక్స్, గృహోపకరణాలు దొరుకుతాయి. ఊరేగింపు సమయంలో మహిళలు పిల్లలు సిల్క్ బట్టతో చేసిన గొడుగులను పట్టుకుని సముద్రపు మట్టిపై ఓపిగ్గా కూర్చుని విగ్రహం తమవద్దకు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఇక రాత్రి వేళల్లో కలర్ఫుల్ లైట్స్, సముద్రం నుంచి వీచే చల్లగాలి, సువాసనతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడే భారతీయులు అసలైన తన్మయత్వం పొందుతారు.
శబరిమల దర్శనం తర్వాత బసలికా చర్చిని దర్శించుకునే భక్తులు
శబరిమల నుంచి 160 కిలోమీటర్ల దూరంలో సెయింట్ సెబస్టియన్ చర్చి ఉంది. అయ్యప్పను దర్శించుకున్న హిందూ భక్తులు సెబాస్టియన్ చర్చిని దర్శించుకోవాల్సిందిగా స్వాగతం పలుకుతుంది చర్చి యాజమాన్యం.ప్రతి ఏటా అయ్యప్పస్వామిని దర్శించుకునే వారి సంఖ్య 50 మిలియన్లు ఉంటుంది. అర్తున్కల్కు చేరుకున్న తర్వాత సెయింట్ సెబాస్టియన్కు ప్రార్థనలు చేస్తారు అయ్యప్ప భక్తులు. అయ్యప్ప స్వామికి సెయింట్ సెబాస్టియన్ ఒక సోదరుడులాంటి వారని భక్తులు విశ్వసిస్తారు. చర్చిలో ప్రార్థనలు చేసిన తర్వాత ఆలయంలో ఉన్న సరస్సులో స్నానాలు ఆచరిస్తారు. లేదా సముద్రంలో స్నానాలు ఆచరిస్తారు. అందుకే మతసామరస్యానికి కేరళలోని సెయింట్ బసలికా చర్చి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ చర్చి కేరళలోని ఇతర చర్చిలకు దేవాలయాలకు వారధిగా నిలుస్తోందని పలువురు భక్తులు చెబుతుంటారు.