సైన్యం నుంచి దక్షిణాది వరకు: మళ్లీ నరేంద్ర మోడీనే ఎందుకు గెలిపించాలంటే?
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా నెల రోజులు కూడా లేవు. ఆ ఏప్రిల్ 11వ తేదీన తొలి విడత ఎన్నికలు జరుగుతాయి. మే 19న తుది విడత ముగుస్తాయి. ఆ తర్వాత 23వ తేదీన ఫలితాలు రానున్నాయి. ఇప్పటి వరకు పలు ప్రీపోల్ సర్వేలు మోడీయే తిరిగి అధికారంలోకి వస్తారని జోస్యం చెబుతున్నాయి. వ్యక్తిగతంగా మోడీకి ఉన్న పాపులారిటీలో కనీసం సగం కూడా ఏ నేతకు లేదని, పార్టీ పరంగా బీజేపీ బెట్టర్ అని దాదాపు అన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, తాజాగా, ట్విట్టర్లో 'వై మోడీ ఎగైన్' (మళ్లీ నరేంద్ర మోడీయే అధికారంలోకి ఎందుకు రావాలి) అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్స్లో టాప్లో నిలిచింది. మోడీ తిరిగి అధికారంలోకి ఎందుకు రావాలో నెటిజన్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి వివరాలు చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ హయాంకు, బీజేపీ హయాంకు తేడాలు కూడా పేర్కొంటున్నారు.
ఏపీ టీడీపీలో కొత్త ఉత్సాహం, జగన్ను 'కేసీఆర్' దెబ్బతీస్తున్నారా, ఇవి సంకేతాలా?
సామాన్యులకు మోడీ ఏం చేశారంటే?
7 కోట్ల మందికి ఎల్బీజీ గ్యాస్ కనెక్షన్లు, వెలుగులో లేని 2 కోట్లమందికి విద్యుత్ సౌకర్యం, 2 కోట్ల మంది పేదలకు ఇళ్లు ఇచ్చారని, స్వచ్ఛ భారత్లో భాగంగా 9 కోట్ల టాయిలెట్లు వచ్చాయని, 33 కోట్ల ఉచిత బ్యాంకు అకౌంట్లు తీశారని, ఆరోగ్య భారత్ కోసం ఆయుష్మాన్ భారత్, 32 కోట్ల ఎల్ఈడీ బల్బులు ఇవ్వడం, 14 కోట్ల ముద్ర రుణాలు, 1.8 లక్షల కిలో మీటర్ల రోడ్లు వేయడం, 35 కొత్త విమానాశ్రయాలు, 7 కొత్త ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఐటీలు, 12 కొత్త ఏఐఐఎంఎస్లు, ఆహార భద్రత పెరగడం, జీఎస్టీ ద్వారా సామాన్యులకు ఎన్నో అందుబాటులోకి రావడం.. ఇలా ఎన్నో కారణాల వల్ల మోడీయే తిరిగి రావాలని చెబుతున్నారు.
మోడీ హయాంలో ఇలా, కాంగ్రెస్ హయాంలో ఇలా
నరేంద్ర మోడీ హయాంలో భారత్ అభివృద్ధిలో దూసుకెళ్తే, కాంగ్రెస్ హయాంలో మాత్రం వెనుకంజలో ఉందని మరో నెటిజన్ పేర్కొంటూ.. వివరాలు ఇచ్చారు. విమానాశ్రయాలు, పోర్టులు, రోడ్లు, ఇళ్లు, ఎల్పీజీ, టాయిలెట్లు, విద్యుత్, తీవ్రవాదం నుంచి భద్రత, జన్ ధన్ యోజ వంటివి మోడీ హయాంలో ఉంటే, కాంగ్రెస్ హయాంలో అరాచకం, స్వామిభక్తి, అవినీతి, కుల-మత విభేదాలు, హిందూ వ్యతిరేకత, విచ్చలవిడి తీవ్రవాదం ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో 2జీ, 3జీ, కామన్వెల్త్ స్కాంలు ఉన్నాయని చెబుతున్నారు.
పాత భారత్, సరికొత్త భారత్
ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ వస్తే ఆర్థిక వృద్ధి పెరుగుతుందని ప్రేమ్ వత్స చెప్పిన దానికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ను పోస్ట్ చేశారు. అలాగే, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు పాత భారత్ ఎలా ఉంది, ఇప్పుడు మోడీ హయాంలో ఎలా ఉందంటూ పోస్టులు పెట్టారు. మోడీ హయాంలో భారత్ సగర్వంగా తలెత్తుకోగలుగుతుందని, అప్పుడు భారత్ గుంపులో గోవిందలా ఉంటే, ఇప్పుడు భారత్ ప్రత్యేక ఆకర్షణలా నిలుస్తోందని చెబుతున్నారు.
సెలవు తీసుకోకుండా పని చేస్తున్న ప్రధాని
నరేంద్ర మోడీ పదమూడేళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇప్పుడు అయిదేళ్లుగా ప్రధానిగా ఉన్నారని, సెలవులు తీసుకోకుండా ప్రతి రోజు పని చేస్తున్నారని, సమయాన్ని సేవ్ చేసేందుకు రాత్రి పూట ప్రయాణం చేస్తారని, అవినీతి ఆరోపణలు లేవని అందుకే మోడీ మళ్లీ ప్రధానిగా రావాలని నెటిజన్లు పేర్కొంటున్నారు. మోడీ మళ్లీ ఎందుకు గెలవాలో చెప్పేందుకు ఎన్నో ఉన్నాయని, ఓడించాలని చెప్పేందుకు మాత్రం ఒక్క కారణమూ లేదని అంటున్నారు.
దక్షిణాదికి ఏమివ్వలేదా?
సైనికులకు ఓఆర్ఓపీ, 36 రాఫెల్ జెట్స్ తీసుకు రావడం కోసం డీల్, సైన్యానికి సరికొత్త ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వడం, ప్రతిఘటించేందుకు సైన్యానికి స్వేచ్ఛ ఇవ్వడం వంటివి మోడీ వల్లే సాధ్యమని అంటున్నారు. మోడీ దక్షిణాదికి ఏమీ ఇవ్వలేదనడంపై కూడా కౌంటర్లు ఇస్తున్నారు. ఏపీకి ఎయిమ్స్ మంగళగిరి, ఐఐటీ తిరుపతి, ఐఐఎం విశాఖపట్నం, ఐఐఐటీ కర్నూలు, విశాఖపట్నం ఎయిర్ పోర్టు, కుప్పం ఎయిర్ పోర్టు, విశాఖపట్నం స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్, కర్నూలులో అల్ట్రా మెగా సోలార్ పార్క్, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, అమరావతి అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే తదితరాలు ఇచ్చారని, తెలంగాణకు హైదరాబాద్ మెట్రో, హైదరాబాద్ ఎయిమ్స్, అలాగే తమిళనాడు, కర్ణాటక, కేరళలకు ఎన్నో ఇచ్చారని చెబుతున్నారు.