మోడీ! బీజేపీ ఓడిపోతే సంతోషిస్తావా, చర్చకు రా: చంద్రబాబు దిమ్మతిరిగే కౌంటర్
అమరావతి: ఓ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ, నోట్ల రద్దు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, ఆర్మీ, సర్జికల్ స్ట్రయిక్స్.. తదితర అంశాలపై స్పందించారు. అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, మహా కూటమి ఓటమిపై కూడా మాట్లాడారు. దీనిపై ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వెంటనే కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు-కాంగ్రెస్ కూటమి ఓటమిపై మోడీ ఇలా
తెలంగాణలో బీజేపీ ఓడిపోతే మోడీకి ఎందుకు సంతోషం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయిందని, అయినా ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు సంతోషంగా ఉన్నారని సూటిగా ప్రశ్నించారు. సీబీఐ, ఆర్బీఐ వంటి వ్యవస్థలను నాశనం చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. మోడీ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... వ్యవస్థలను నాశనం చేసిందని చెప్పే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. దీనిపై చంద్రబాబు పైవిధంగా స్పందించారు.
మోడీ చర్చకు సిద్ధమా
ఈ నాలుగున్నరేళ్లలో నరేంద్ర మోడీ దేశానికి ఏం చేశాడో చెప్పగలరా అని చంద్రబాబు ప్రశ్నించారు. తాము కేంద్రం పైన అక్కసుతో మాట్లాడటం లేదని, అర్థవంతంగా మాట్లాడుతున్నామని చెప్పారు. దేశంలో ఏం అభివృద్ధి జరిగిందో, ఏం చేశారో, ఏపీకి ఏం చేశారో చర్చకు సిద్ధమా అని నరేంద్ర మోడీకి సవాల్ విసిరారు.
ఏపీలో ఇంటికొక స్మార్ట్ ఫోన్
చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇంటికొక స్మార్ట్ ఫోన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. నేడు స్మార్ట్ ఫోన్ అవసరం పెరిగిందని తెలిపారు. త్వరలో ఫోన్ల పథకం అమలు చేస్తామన్నారు. సామాన్యుడికి స్మార్ట్ ఫోన్ దగ్గర చేస్తామన్నారు. కొందరు మాయమాటలు చెప్పి మభ్యపెడుతున్నారన్నారు. ప్రజలు అన్నీ ఆలోచన చేయాలన్నారు.
హైదరాబాద్ లాంటి నగరం లేదు
హైదరాబాద్ లాంటి నగరం దేశంలో లేదని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్లా తయారవడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, ఓర్వకల్ ఎయిర్ పోర్టు, రాజధాని, పరిశ్రమల ఏర్పాటుతో దూసుకుపోతున్నామని చెప్పారు. వెల్ఫేర్ ఇవ్వడం ఒకటైతే ప్రజల ఖర్చును తగ్గించడం మరో విధానం అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచకపోతే ప్రజల ఖర్చు తగ్గించినట్లే అన్నారు. ఏపీ అనేది పూర్తిస్థాయి వెల్ఫేర్ రాష్ట్రం అన్నారు.