పతాక స్ధాయికి రైతుల పోరు- మోడీ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి- మన్మోహన్, థాచర్ల అనుభవాలతో..
ఢిల్లీలో రైతుల ఆందోళన పతాక స్ధాయికి చేరింది. కేంద్రం పార్లమెంటులో ఆమోదించిన కార్పోరేట్ వ్యవసాయ బిల్లులు చట్టాలుగా కూడా మారిపోయినా రైతులు మాత్రం ఎక్కడా వెనక్కితగ్గడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా రైతులకు మద్దతు పెరుగుతోంది. ఇలాంటి సమయంలో కేంద్రం ఎలాంటి వైఖరి అనుసరించబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. రైతుల ఆగ్రహంతో వ్యవసాయ బిల్లుల్లో సవరణలకు కేంద్రం సిద్ధమవుతోంది. అయితే అన్నదాతలు మాత్రం ఈ నల్ల చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ గతానభవాలను దృష్టిలో ఉంచుకుని ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నది కీలకంగా మారింది.
రైతుల ఆగ్రహంతో కేంద్రానికి ముచ్చెమటలు..
కేంద్రం పార్లమెంటులో తనకున్న మెజారిటీతో వ్యవసాయ బిల్లులను ఆమోదించినా ఇప్పుడు వాటిని ప్రజల్లో సమర్ధించుకోలేని పరిస్ధితి వచ్చేసింది. మందబలంతో బిల్లులను చట్టాలుగా మార్చుకున్నా.. ప్రజల్లో ఆమోదం లేకపోతే ఎలాంటి పరిస్ధితులు తలెత్తుతాయన్నది ఢిల్లీని చుట్టుముట్టిన రైతులు నిరూపిస్తున్నారు. దీంతో కేంద్రానికి గడ్డకట్టే చలిలోనూ ఢిల్లీలో ముచ్చెమటలు పడుతున్నాయి. ఇప్పటికే పార్లమెంటు ఆమోదించిన వ్యవసాయ చట్టాల్లో సవరణలకు డిమాండ్లు పెరుగుతుండగా.. రైతులు మాత్రం పూర్తిగా చట్టాలన వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లను వినిపిస్తున్నారు. దీంతో ప్రధాని మోడీ ఇవాళ కీలక మంత్రులతో భేటీ అయ్యారు.
మోడీ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి...
వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు ప్రస్తుతానికి ఉత్తరాదికే పరిమితమైనా ఇదే పరిస్ధితి మరికొన్ని రోజులు కొనసాగితే దక్షిణాదికీ వ్యాపించే ప్రమాదముంది. ఇప్పటికే వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఈ నెల 8న రైతులు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. దీంతో మోడీ సర్కారు కార్పోరేట్ చట్టాలపై ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది. ప్రస్తుతానికి రైతులతో జరిపిన చర్చల్లో చట్టాల సవరణకు అంగీకరించినా రైతులు మాత్రం మొత్తం చట్టాలనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుండటంతో ఈ విషయంలో కేంద్రం ఏం చేయబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది. తాజాగా ప్రధాని మోడీ గతానుభవాలను దృష్టిలో ఉంచుకుంటే ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి కూడా నెలకొంది.
మన్మోహన్ బాటా ? థాచరే మార్గమా
గతంలో భారత్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బ్రిటన్లో మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ కూడా ఇలాంటి పరిస్ధితినే ఎదుర్కొన్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు వీరిద్దరూ సిద్దమైనప్పుడు భిన్నమైన అనుభవాలు ఎదుర్కొన్నారు. ఇందులో ముందుగా థాచర్ పరిస్దితిని చూస్తే అప్పట్లో బ్రిటన్లో వేళ్లూనుకుపోయిన అరాచక పరిస్ధితులను ఎదుర్కొనేందుకు సంస్కరణలకు తెరదీశారు. వీటిపై ఎంత వ్యతిరేకత వ్యక్తమైనా ఆమె లెక్కచేయలేదు. చివరికి అందులో గెలిచి ఐరన్ లేడీగా పేరుతెచ్చుకున్నారు. ఆ తర్వాత యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ కూడా సంస్కరణలకు సిద్ధమైనప్పుడు అలాంటి పరిస్ధితే ఎదురైంది. అప్పట్లో రైతులతో కలిసి హజారే చేసిన ఉద్యమానికి తలొగ్గిన యూపీఏ సర్కారు. వారి డిమాండ్లకు అంగీకరించాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిలో మోడీ ఏ మార్గం ఎంచుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది.
మోడీ నిర్ణయం దేశ రాజకీయాలకు టర్నింగ్
కరోనాకు ముందు సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఆందోలనల వెనుక ప్రధానంగా ముస్లింలు, కమ్యూనిస్టులు ఉంటే ఈసారి రైతుల వెనుక సిక్కులున్నారు. సీఏఏతో పోలిస్తే రైతుల ఉద్యమానికి దేశవ్యాప్త మద్దతు లభిస్తోంది. దీంతో సీఏఏ ఆందోళలను అణచివేసిన తరహాలో రైతుల ఉద్యమాన్ని అణచివేయడం కూడా సాధ్యం కాదు. అసలే కరోనా కారణంగా గత ఆరు త్రైమాసికాల్లో ఆర్ధిక వృద్ధి క్షీణిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్దికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సంస్కరణలు తక్షణావసరంగా మారిపోయాయి. దీంతో ఇప్పుడు సంస్కరణల కోసం రైతులను లెక్కచేయకుండా ముందుకెళ్లాలా లేక వ్యవసాధారిత దేశంలో రైతులకే ప్రాధాన్యం ఇవ్వాలా అన్న క్లిష్టమైన ప్రశ్న మోడీ ముందు నిలిచింది. ఇందులో మోడీ తీసుకునే నిర్ణయం కచ్చితంగా భవిష్యత్ రాజకీయ, ఆర్ధిక రంగాల్లో భారత్కు ఎంతో కీలకమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.