ఎవరీ ముకుల్ వాస్నిక్.. ఆయనకే కాంగ్రెస్ పగ్గాలు ఎందుకు ?
న్యూఢిల్లీ : కాంగ్రెస్ కొత్త చీఫ్ బెర్త్ కన్ఫామ్ అయ్యింది. సీనియర్ నేత ముకుల్ వాస్నిక్కు పార్టీ పగ్గాలు అప్పగించనుంది. దీంతో ముకుల్ వాస్నిక్ ఎవరు ? ఆయన నేపథ్యమేంటీ ? పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యమేంటీ అనే చర్చ మొదలైంది. ముకుల్ వాస్నిక్ .. మరాఠా నేత. మహారాష్ట్రకు చెందిన వాస్నిక్ పాతికేళ్ల ప్రాయంలోనే ఎంపీగా విజయం సాధించారు. అప్పటినుంచి ఆయన విజయయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఇబ్బందుల్లో ఉంది. దీంతో పార్టీకి పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు వాస్నిక్ అనుభవం కలిసొస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆయనకు పార్టీ పరంగా, పరిపాలనపరంగా ఉన్న అనుభవం పార్టీకి మేలు చేస్తుందని మెజార్టీ నేతలు భావిస్తున్నారు.
ఇదీ నేపథ్యం ..
ప్రముఖ నేత బాలకృష్ణ వాస్నిక్ కుమారుడే ముకుల్ వాస్నిక్. బాలకృష్ణ కూడా బుల్దానా నుంచి ఎంపీగా గెలిచారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టుంది. కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా పేరుగడించారు. 1959 సెప్టెంబర్ 27న జన్మించిన ముకుల్ .. బీఎస్సీ గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత ఎంబీఏ చేసి .. రాజకీయాల్లోకి వచ్చారు. యూత్ కాంగ్రెస్ నేతగా చురుగ్గా పాల్గొన్నారు. 1984లో .. 25 ఏళ్లకే బుల్దానా లోక్ సభ నుంచి ఎంపీగా గెలచి రికార్డు సృష్టించారు. తర్వాత వరసగా 1998, 1991, అక్కడినుంచే ఎంపీగా గెలుపొందారు. 2009లో మాత్రం రామ్తక్ నియోజకవర్గం నుంచి పోటీచేసి .. గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1984లో ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. తర్వాత మూడేళ్లకు జాతీయ కాంగ్రెస్ యూత్ విభాగం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అక్కడినుంచి పార్టీలో క్రమంగా ఎదుగుతూ వస్తున్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు.
పాలనా అనుభవం
పీవీ నరసింహరావు ప్రభుత్వంలో కూడా కేంద్రమంత్రిగా పనిచేశారు. 2009లో మన్మోహన్ మంత్రివర్గంలో సామాజిక న్యాయం, ఉపాధి కల్పన మంత్రిగా పనిచేశారు. ఇటు పార్టీపై పట్టు, పాలానాపరంగా అనుభవం ఉండటంతో ముకుల్ వాస్నిక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి సమర్థుడని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో అధ్యక్ష పదవీ కోసం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి (సీడబ్ల్యూసీ) సమావేశమై నిర్ణయం తీసుకుంది.
వాస్నిక్ ఎందుకుంటే ..
ముకుల్ వాస్నిక్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే సోనియాతో కాంగ్రెస్ ముఖ్య నేతలు అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, ఏకే ఆంటోని సమావేశమయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమితో తానే కాదు గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచి కూడా ఎవరూ అధ్యక్ష పదవీ చేపట్టబోరని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. దీంతో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత గాంధీ నెహ్రూ కుటుంబాల నుంచి కాకుండా ఇతర నేతకు అధ్యక్ష పదవీ వరిస్తోంది. సోనియాగాంధీ అధ్యక్ష పదవీ చేపట్టకముందు సీతారాం కేసరీ పార్టీ బాధ్యతలను నిర్వర్తించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇతర నేత కాంగ్రెస్ చీఫ్ పదవీ చేపట్టబోతున్నారు.