వ్యూహాత్మకంగా నవీన్ పట్నాయక్... రాజ్యసభలో మోదీ సర్కార్కు షాక్ ఇవ్వడం వెనక కారణమిదే...
రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను బిజూ జనతా దళ్ వ్యతిరేకించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. నిజానికి బీజేడీ బీజేపీ అగ్రి బిల్లులకు మద్దతునిస్తుందని ముందుగా లీకులు వచ్చినప్పటికీ... ఆ తర్వాత సీన్ మారిపోయింది. లోక్సభలోనూ బీజేడీ అగ్రి బిల్లులను వ్యతిరేకించినప్పటికీ... బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉంది కాబట్టి ఎవరి మద్దతు అవసరం లేకుండా పోయింది. కానీ రాజ్యసభలో ఇతర ప్రాంతీయ పార్టీలు మద్దతునిస్తే తప్ప బిల్లులు గట్టెక్కలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేడీ రాజ్యసభలో తమకు మద్దతునిస్తుందని బీజేపీ కూడా భావించింది. కానీ నవీన్ పట్నాయక్ మాత్రం బీజేపీకి అనూహ్య షాకిచ్చారు. అయితే రాజ్యసభలో బీజేడీ ఈ బిల్లులను వ్యతిరేకించడం వెనుక పట్నాయక్ లెక్క వేరే ఉందన్న వాదన వినిపిస్తోంది.
వ్యవసాయ బిల్లులపై రగడ - సస్పెండైన రాజ్యసభ ఎంపీల నిరవధిక దీక్ష - ఏకమైన విపక్షాలు
వ్యూహాత్మకంగానే బీజేడీ...
ఒడిశా ప్రధానంగా వ్యవసాయ రాష్ట్రం. ప్రతీ ఏటా వ్యవసాయానికి కూడా ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయిస్తారు. బీజేడీ ప్రధాన ఓటు బ్యాంకులో రైతులు కూడా కీలకం. అందుకే 2019 ఎన్నికల్లో రైతులు,కౌలుదారుల ఓట్లను ఆకర్షించేందుకు పలు పథకాలు ప్రకటించారు. అందులో కలియా పథకం ఒకటి. ఈ పథకం ద్వారా చిన్న,సన్నకారు రైతులతో పాటు కౌలు దారులకు ప్రభుత్వం నగదు సాయం అందిస్తుంది. బీజేడీ ఇచ్చిన ఈ హామీ పట్ల రైతులు విశ్వాసం ఉంచి మరోసారి నవీన్ పట్నాయక్కే పట్టం కట్టారు. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు చిన్న,సన్నకారు రైతులకు నష్టం చేసేలా ఉన్నాయన్న ఉద్దేశంతో బీజేడీ వాటిని వ్యతిరేకించింది.
బీజేడీ ఎంపీలు ఏమంటున్నారు...
బీజేడీ ఈ బిల్లులను పూర్తిగా వ్యతిరేకించనప్పటికీ అందులోని కొన్ని అంశాలపై మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బీజేడీ రాజ్యసభ సభ్యుడు సస్మిత్ పాత్రా ఈ బిల్లులను స్టాండింగ్ కమిటీ ముందుకు పంపించాలని డిమాండ్ చేశారు. చిన్న,సన్నకారు రైతులను ఆదుకునేలా బిల్లుల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరో బీజేడీ ఎంపీ అమర్ పట్నాయక్ మాట్లాడుతూ.... 'కొత్త బిల్లులతో వ్యవసాయ మార్కెట్ విధానంలో విప్లవాత్మక మార్పు వస్తుందని... రైతులకు మేలు జరుగుతుందని కేంద్రం చెబుతోంది. కేంద్రం ఉద్దేశం మంచిదే అయినప్పటికీ... ఆచరణలో ఉన్న సంక్లిష్టతల గురించి మాత్రం పట్టించుకోవట్లేదు.' అని అభిప్రాయపడ్డారు. కొత్త వ్యవసాయ బిల్లుల్లో కనీస మద్దతు ధరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని... ఈ బిల్లులు పెద్ద వ్యాపారులకు,ఈకామర్స్ కార్పోరేట్లకు మేలు చేసేలా ఉన్నాయని ఎంపీ అమర్ విమర్శించారు. కనీస మద్దతు ధర అంశాన్ని పూర్తిగా విచ్చిన్నం చేసేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారా అని ప్రశ్నించారు.
రైతు ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకునే...
రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించడం ద్వారా తమ ప్రధాన ఓటు బ్యాంకు అయిన రైతుల్లో పార్టీ పట్ల నమ్మకం సడలకుండా బీజేడీ చూసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యసభలో బిల్లులను వ్యతిరేకించడం పార్టీ పట్ల రైతుల్లోకి పాజిటివ్ సంకేతాలు పంపించిందని బీజేడీ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. నిజానికి గత లోక్సభ ఎన్నికల్లో బీజేడీకి సీట్లు తగ్గడానికి రాష్ట్రంలో కొన్నిచోట్ల రైతు నిరసనలు కూడా కారణమన్న వాదన ఉంది. ఆ నిరసనలే రాష్ట్రంలో బీజేపీకి కలిసొచ్చాయన్న వాదన కూడా ఉంది. కాబట్టి బీజేపీ తీసుకొచ్చిన ఈ బిల్లులను వ్యతిరేకించడం ద్వారా ఆ పార్టీని విలన్గా చిత్రీకరించడంతో పాటు రైతుల కోసం తామే చిత్తశుద్దిగా పనిచేస్తున్నామన్న సంకేతాలను బీజేడీ పంపించిందని చెబుతున్నారు.
Recommended Video
గతంలో పలు సందర్భాల్లో బీజేపీకి మద్దతు...
గతంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలోనూ,ఆర్టికల్ 370 రద్దు,సీఏఏ తదితర చట్టాల విషయంలో బీజేపీకి బీజేడీ మద్దతునిచ్చింది. అయితే తాజా అంశం రైతులతో ముడిపడి ఉన్నది కావడం... రాష్ట్రంలో రైతు ఓటు బ్యాంకే కీలకం కావడంతో బీజేడీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రైతు ప్రయోజనాల అంశం ఒకటైతే... ఈ బిల్లును సమర్థిస్తే రైతుల్లోనూ బీజేపీ పట్ల సానుకూలత ఏర్పడుతుందని బీజేడీ భావించింది. అందుకే రాజ్యసభలో ఈ బిల్లులను వ్యతిరేకించింది.