Disha Murder case: ఆ తప్పు.. అదే జాప్యం.. దిశ కేసులో నెలకొంటుందా? గుణపాఠం నేర్చకుంటారా?
న్యూఢిల్లీ: ఏడేళ్ల కిందట యావత్ దేశాన్ని కదిలించిన దారుణ ఘటన నిర్భయ. దేశ రాజధానిలో నడి బొడ్డున, వేలాది వాహనాలు సంచరించే రహదారుల మీద ఓ అమ్మాయిపై అత్యంత కిరాతకంగా అత్యాచారం చోటు చేసుకున్న ఘటన అది. ఏడేళ్లే కాదు.. ఎన్నేళ్లయినా ఎవరూ విస్మరించని విషాదకర ఘటన. ఈ అత్యాచార ఉదంతంలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు 13 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
నివ్వెర పోయేలా చేసిన దిశ ఉదంతం..
తాజాగా హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ లో చోటు చేసుకున్న వెటర్నరి డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కూడా దాదాపు ఇలాంటిదే. క్షణ తీరిక లేకుండా వేలాది వాహనాలు సంచరించే హైదరాబాద్-కర్నూలు జాతీయ రహదారికి అత్యంత సమీపంలో నలుగురు కామాంధులు.. ఘోర కృత్యానికి పాల్పడటం మరోసారి మన దేశాన్ని నివ్వెరపోయేలా చేసింది. మహిళల భద్రతపై కోట్లది మందిని ఏకం చేసింది. ఒకే గొంతుతో నినదించేలా చేస్తోంది.
నిర్భయ-దిశ.. రెండింటి మధ్యా..
అత్యంత భావసారూప్యం గల ఈ రెండు కేసుల్లో బాధిత కుటుంబాలకు న్యాయం ఎలా దక్కుతుందనే విషయం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2012 డిసెంబర్ 16వ తేదీన న్యూఢిల్లీలో నిర్భయ అత్యాచారానికి గురి కాగా.. ఇప్పటిదాకా కూడా ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం జరగలేదు. నిందితులకు ఉరి శిక్ష విధిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. దాన్ని ఇప్పటిదాకా కూడా అమలు చేయట్లేదు.
ఏడేళ్లయినా దక్కని న్యాయం..
ఇదే అంశంపై నిర్భయ తల్లి ఆశాదేవి సైతం అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఏడేళ్లయినప్పటికీ.. నిందితులకు ఉరిశిక్ష విధించకపోగా.. క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు సాగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ దాఖలైన ప్రతిపాదనలను తాజాగా ఢిల్లీ ప్రభుత్వం తోసి పుచ్చిందని గుర్తు చేశారు. ఇలాంటి దారుణ ఘటనలకు పాల్పడిన వారికి యుద్ధ ప్రాతిపదికన శిక్షలను అమలు చేస్తే..మిగిలిన వారిలో భయం కలుగుతుందని చెప్పుకొచ్చారు.
దిశ కేసులో కూడా..
ఇదే తరహా జాప్యం.. వెటర్నరి డాక్టర్ దిశ కేసులో చోటు చేసుకుంటుందా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దిశపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన మహమ్మద్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్న కేశవులును బహిరంగంగా ఉరి తీయాలనే డిమాండ్ తో దేశవ్యాప్తంగా మహిళా సంఘాల ప్రతినిధులు ఉద్యమిస్తున్నారు. సంఘటన చోటు చేసుకున్నప్పటి నుంచీ ఇదే తరహా పరిస్థితులు దేశవ్యాప్తంగా నెలకొన్నాయి. అయినప్పటికీ.. ఆ దిశగా చర్యలు ఉంటాయా? లేవా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఆ జాప్యం ఇక్కడ ఉండకపోవచ్చనే చిరు ఆశ..
నిర్భయ, వెటర్నరి డాక్టర్ దిశలది ఒకే తరహా కేసు. నిర్భయ ఉదంతంలో దోషులకు విధించాల్సిన శిక్షను ఏడేళ్ల తరువాత కూడా అమలు చేయలేదు. డాక్టర్ దిశ అత్యాచార ఘటనలో ఈ పరిస్థితి తలెత్తకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం- నిర్భయ కుటంబానికి న్యాయం చేయడంలో నెలకొన్న జాప్యమే. ఆ తరహా జాప్యాన్ని, అదే తప్పును మరోసారి పునరావృతం కానివ్వరనే ఆశ మిణుకు మంటోంది. నిర్భయ కేసులో నెలకొన్న జాప్యాన్ని డాక్టర్ దిశ కేసులో చూపించకపోవచ్చని అంటున్నారు.
అదే తప్పు పునరావృతం చేయకపోవచ్చు..
ఒకసారి చోటు చేసుకున్న జాప్యాన్ని మరో కేసులో ప్రదర్శించకపోవచ్చని, తప్పనిసరిగా గుణపాఠం నేర్చుకునే ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. నిర్భయ ఉదంతంలో దోషులకు అప్పటికప్పుడు శిక్షను అమలు చేసి ఉండి ఉంటే.. బహుశా డాక్టర్ దిశ ఘటన చోటు చేసుకుని ఉండకపోవచ్చని అంటున్నారు మహిళా సంఘాల ప్రతినిధులు. ఇప్పటికైనా దిశ కేసులో జాప్యం చేయకుండా నిందితులపై కఠిన చర్యలను తీసుకోవడం వల్ల ఇలాంటి దారుణ కృత్యాలకు అడ్డుకట్ట పడటానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.