నీతిఆయోగ్ సమావేశం నిర్వహించింది ఇందుకేనా..??
Recommended Video
సుధీర్ఘ కాలం తర్వాత, చిత్రమైన రాజకీయ మలుపుల తర్వాత, నోట్ల రద్దు, జీయెస్టీ పధకాల పై ప్రజల స్పష్టమైన అవగాహన తర్వాత ఢిల్లిలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో అందరూ తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి తీసుకోవాల్సిన అభిప్రాయలను పక్కన పెట్టి సొంత ఎజెండాల కోసం పాకులాడారు. సమావేశంలో తటస్థంగా వ్యవహరిస్తూ నిస్పక్షపాతంగా నడుచుకోవాల్సిన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధాని మోదీ కూడా సమీప భవిష్యత్తులో రాబోవు ఎన్నికలకోసం ఏర్పాటు చేసిన సమావేశంలాగా నీతి ఆయోగ్ కార్యక్రమాన్ని మలిచి, తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసారు.
నీతి ఆయోగ్ కార్యక్రమమా..? రాజకీయ ఎజెండానా..?
ఎవరికి వారు నట విశ్వరూపాన్ని చూపించి సన్నివేశాన్ని రక్తి కట్టించారు. ఎవరి అవసరాల మేరకు వారు ఆ వేదికను వాడేసుకున్నారు. ముఖ్యమంత్రులు రాష్ట్రాల వారిగా విడిపోయి, అవసరాల మేరకు ప్రసంగాలు చేశారు. మొత్తంగా చెప్పాలంటే ఢిల్లీలో జరిగిన నీతి అయోగ్ సమావేశం ఆసాంతం రాజకీయ ఎజెండాను ప్రదర్శించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తి స్థాయిలో రాజకీయ చతురత ప్రదర్శించారు. ఒక్క మాటలో చెప్పాలంటే వచ్చే ఎన్నికలే లక్ష్యంగా నీతి అయోగ్ సమావేశం కూడా జరిగినట్టు కనిపించింది.
చంద్రబాబు మార్క్ రాజకీయం చూపించే ప్రయత్నం..
సమావేశం జరిగిన తీరును గమనిస్తే దేశంలో ఎన్నికల వాతావరణం వచ్చేసినట్టే కనిపిస్తోంది. ఎన్డీయే, ఎన్డీయేతర పక్షాల మొహరింపు వేదికగా ఈ సమావేశం కనిపించింది. ఇప్పటికే ఎన్డీయే నుంచి బయటకు వచ్చి దేశరాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతోన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఆయన ఢిల్లీ వెళ్లీ వెళ్లడంతోనే వేడి రాజేశారు. పశ్చిమ బెంగాల్, కేరళ, కర్నాటక ముఖ్యమంత్రులతో భేటీ నిర్వహించి, అక్కడ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ అధికారిక నివాసంలో గత వారం రోజులుగా ధర్నా చేస్తోన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కలిసే ప్రయత్నం చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న కేజ్రీవాల్ కు మద్ధతు ప్రకటించడం ద్వారా ఒక్క సారిగా జాతీయ రాజకీయాల్లో పరిణామాలు వేడెక్కాయి.
కేంద్ర ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిన సమావేశం..
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనడానికని ఢిల్లీ వెళ్లిన సీఎంలు ఆ సందర్భాన్ని సైతం రాజకీయంగా చక్కగా ఉపయోగించుకున్నారు. ముందు రోజు కేజ్రీవాల్ రూపంలో వారికి అవకాశం రాగా... మరుసటి రోజు నీతి అయోగ్ మీటింగ్ ను సైతం అదే స్థాయిలో వాడుకున్నారు. మోడీకి వ్యతిరేకంగా దేశ స్థాయిలో కూటమి ఏర్పడుతోందన్న విషయాన్ని ఆయన అధ్యక్షతన జరిగే సమావేశం ద్వారానే బల్లగుద్ది చెప్పారు. సమావేశానికి ముందు రోజు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపిన చంద్రబాబు ఓ దశలో మోడీ ప్రసంగాన్నే బాయ్ కాట్ చేయాలన్న స్థాయి ఆలోచన చేశారు.
ప్రాంతీయ పార్టీల ఐకమత్యాన్ని చాటి చెప్పిన నీతి ఆయోగ్ సమావేశం..
మొత్తం మీద సమావేసం సాఫీగానే సాగినా... ప్రాంతీయ శక్తులు మాత్రం తమ రాజకీయ ఎజెండాను ఈ మీటింగ్ నుంచే మరోసారి ప్రకటించాయి. రాష్ట్రాల పై కేంద్రం పెత్తనాన్ని సహించేది లేదని తేల్చి చెప్పాలి. వచ్చే ఎన్నికలకు ఇదే ఎజెండా అన్న సంకేతాలు కూడా పంపాయి. ఒక్క మాటలో చెప్పాలంటే... నీతి అయోగ్ మీటింగ్ లో 2019 ఎన్నికల వాతావరణం అలుముకుందన్న విషయం స్పష్టంగా అర్థమైంది.