కిస్సా కుర్చీకా.. అనుభవమా, యువతనా? కాంగ్రెస్ చీఫ్ రేసులో ఐదుగురు..!!
న్యూఢిల్లీ : 130 ఏళ్ల చరిత్ర, భారత స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర వహించింది. బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందాక వరుసగా అధికారం చేపట్టింది. అదే కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డు. గతంలో కూడా ఎన్నో అటుపోట్లను చూసింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కానీ కొంచెం విచిత్రం .. అధ్యక్ష పదవీకి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ బాస్ పదవీ చేపట్టేందుకు మరే నేత ముందుకురాకపోవడం గమనార్హం. దాదాపు రెండునెలల నుంచి ఆ పార్టీకి క్రియాశీల అధ్యక్షుడు లేరు. కానీ అధ్యక్ష పదవీ చేపట్టేందుకు నేతలెవరు ఆసక్తి చూపకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
నాన్ గాంధీ-నెహ్రూ
కాంగ్రెస్ చీఫ్గా రాజీనామా చేసిన రాహుల్ గాంధీ .. తన అమ్మ సోనియా, సోదరి ప్రియాంక గాంధీ కూడా అధ్యక్ష పదవీ చేపట్టబోరని పేర్కొన్నారు. అంతేకాదు గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచి కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు చేపట్టబోరని స్పష్టంచేశారు. దీంతో రాహుల్ తర్వాత అధ్యక్ష పదవీ చేపట్టే నేత కోసం ఆ పార్టీ భూతద్దం పెట్టుకొని వెతుకుతుంది. ఓ వైపు అధినేత కోసం పార్టీ ఫోకస్ చేస్తే .. కర్ణాటక రాజకీయాలు హీటెక్కాయి. మరోవైపు గోవా సీఎల్పీ విలీనం కూడా హస్తం పార్టీకి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అత్యున్నక నిర్ణయాక మండలి సీడబ్ల్యూసీ సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.
ముందువరసలో సచిన్
కాంగ్రెస్ చీఫ్ రేసులో రాహుల్ సన్నిహితుడు సచిన్ ఫైలట్ పేరు వినిపిస్తోంది. ఆయన కూడా సీడబ్ల్యూసీ సమావేశమై .. అధినేతను ఎన్నుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశానికి ముందే అధ్యక్ష పేరును పరిశీలిస్తున్నామని సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, మల్లిఖార్జున ఖర్గే, మోతిలాల్ వోరా పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ రెండు విభాగాలు విడిపోయినట్టు స్పస్టమవుతుంది. రాహుల్ టీంలోని సచిన్ ఫైలట్, జ్యోతిరాదిత్య సింధియా .. మరోవైపు సీనియర్ల అధినేతపై ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు.
అనుభవాన్ని రంగరించి
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభంపై సీనియర్ నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు గాంధీ-నెహ్రూ కుటుంబమే చూస్తుందని చెప్తున్నారు. అయితే అందుకు రాహుల్ నిరాకరించడంతో ప్రత్యామ్నాయం చూడాలని కోరుతున్నారు. ఎవరో ఒకరికి పదవీ కట్టబెట్టాలనే వాదన బలంగా వినిపిస్తున్నారు. అయితే ఎప్పుడూ తిరిగి పదవీ చేపట్టేందుకు ముందుకొస్తే అప్పుడు అధ్యక్ష పదవీ తిరిగి అప్పగిస్తామని పేర్కొంటున్నారు. ప్రస్తుతం కుల రాజకీయాలు జరుగుతున్నందున .. బీజేపీ ఓబీసీ, దళితుల పేరుతో రాజకీయాలు చేస్తుందని చెప్తున్నారు. ఈ క్రమంలో దళితుడిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ఖర్గె వర్సెస్ సుశీల్
ఒకవేళ దళితుడిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయాలంటే ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే, మాజీ లోక్ సభ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే పేర్లు ముందువరుసలో ఉన్నాయి. అయితే వీరిలో ఎవరివైపు హైకమాండ్ మొగ్గు చూపుతుందో చూడాలి. అయితే దళిత నేతగా సీఎం అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంపై ఖర్గే ఇదివరకే అసంతృప్తి వ్యక్తం చేశారు. మరీ కాంగ్రెస్ అధ్యక్ష పదవీ చేపట్టేందుకు ముందుకొస్తారో లేదో చూడాలి మరీ. అంతేకాదు వీరి వయస్సు, అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. అయితే యువత క్యేటగిరి నంచి జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ ఫైలట్, మిలింద్ దేవరా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో యువతకు అవకాశం దక్కుతుందా ? లేదా అనుభవానికి పెద్దపీట వేస్తారా ? ఇంతకీ ఎవరికీ కాంగ్రెస్ చీఫ్ పదవీ దక్కనుందనే అంశంపై మరికొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది.