ఎయిమ్స్ ఎందుకు కాదు: అమిత్ షా లక్ష్యంగా శశిథరూర్ విమర్శలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ సంస్థలు ప్రజల నమ్మకాన్ని పొందాలంటే ప్రముఖులు వాటిని సందర్శించాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రభుత్వ ఆస్పత్రిలో కాకుండా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడాన్ని శశిథరూర్ తప్పుబట్టారు.
'హోంమంత్రి అమిత్ షా అనారోగ్యానికి గురైనప్పుడు ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)కు వెళ్లకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆయన ప్రభుత్వ ఆస్పత్రికి కాకుండా పొరుగు రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి ఎందుకు వెళ్లారు. ప్రభుత్వ సంస్థలు ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే ప్రముఖులు వాటిపై ప్రజలకు నమ్మకం కలిగించాలి' అని శశిథరూర్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
అంతేగాక, ఎయిమ్స్ నమూనాను అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పరిశీలిస్తున్న ఫొటోను కూడా థరూర్ జత చేశారు. కాగా, ఆదివారం తనకు కరోనా సోకినట్లు హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. వైద్యుల సూచన మేరకు తాను ఆస్పత్రిలో చేరుతున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని అమిత్ షా తెలిపారు. కాగా, అమిత్ షా ప్రస్తుతం గుర్గావ్లోని మేదాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే శశిథరూర్.. అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
True. Wonder why our Home Minister, when ill, chose not to go to AIIMS but to a private hospital in a neighbouring state. Public institutions need the patronage of the powerful if they are to inspire public confidence. https://t.co/HxVqdREura
— Shashi Tharoor (@ShashiTharoor) August 3, 2020
Recommended Video
ఆదివారం అమిత్ షాతోపాటు పలువురు ప్రముఖులు కూడా కరోనా బారిన పడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కరోనా బారిపడ్డారు. మాజీ కేంద్రమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు కూడా కరోనా సోకింది. యూపీకి చెందిన ఓ మంత్రి కరోనా బారినపడి మరణించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా నుంచి కోలుకుంటున్నారు.