జీడీపీ 5 శాతానికి చేరింది.. అందుకే బెయిల్ రావడం లేదు, మీడియా ప్రతినిధులతో చిదంబరం ...
న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసు మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని గుక్కతిప్పుకొనివ్వడం లేదు. సీబీఐ కస్టడీ కొనసాగుతుంది. ఇప్పటికే 12 రోజులు కస్టడీకి తీసుకోగా .. తాజాగా మరో రెండురోజుల కస్టడీకి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసింది. ఈ క్రమంలో ఇవాళ చిదంబరాన్ని మీడియా ప్రతినిధులు కలిశారు. బెయిల్కు సంబంధించి ప్రశ్నించగా .. తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు చిదంబరం.
ఐఎన్ఎక్స్ మీడియా కేసు: 5 వరకు చిదంబరం కస్టడీ పొడిగింపు, తీహార్కు వద్దు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్ కోసం చిదంబరం తరఫున న్యాయవాదులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుతోపాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయినప్పటికీ ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ససేమిరా అంటోంది. ఇవాళ కూడా మరో రెండురోజుల కస్టడీ గడువును పొడిగించింది. ఈ క్రమంలో కొందరు మీడియా ప్రతినిధులు చిదంబరంతో మాట్లాడారు. బెయిల్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించగా .. దేశ స్థూల జాతీయోత్పత్తి 5 శాతానికి పడిపోయిందన్నారు.
అందుకే తనకు బెయిల్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటోందని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. మాజీ కేంద్ర ఆర్థికమంత్రి సమాధానం విని మీడియా ప్రతినిధులు నోరెళ్లబెట్టారు. అదేంటి జీడీపీ తగ్గితే .. చిదంబరానికి బెయిల్ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. లేదంటే జీడీపీ తగ్గిందని చిదంబరం పరోక్షంగా ప్రస్తావించారని మరికొందరు అంటున్నారు. తనను అరెస్ట్ చేస్తే .. జీడీపీ అలాగే తగ్గుతుందని చిదంబరం సంకేతాలు ఇచ్చారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.