బీఎస్-VI ఎఫెక్ట్ : ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఇంధన ధరలు.. ఎందుకో తెలుసా..
ఏప్రిల్ 1వ తేదీ నుంచి రిటైల్ ఇంధన ధరలు గణనీయంగా పెరగనున్నాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC) వెల్లడించింది. అదే సమయంలో వినియోగదారులపై మరీ ఎక్కువ భారం మోపదలుచుకోలేదని ఐఓసీ ఛైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి భారత్లో బీఎస్(భారత్ స్టాండర్డ్)-6 వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేసే నిబంధన అమలులోకి వస్తుండటంతో పెట్రోల్,డీజిల్ ధరలు పెరగనున్నాయి. మార్చి 31 తరువాత బీఎస్-3, బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి బీఎస్-6 ప్రమాణాల ఇంధనం మాత్రమే సప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి ధరలు పెరిగే అవకాశం ఉంది.
కాలుష్య నియంత్రణకు బీఎస్-6..
వాహన కాలుష్యాన్ని నియంత్రించే ఉద్దేశంతో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం బీఎస్-6 వాహనాల నిబంధనను అమలులోకి తెస్తోంది. ఒకవేళ ఎవరైనా బీఎస్-3,బీఎస్-4 వాహనాలను కలిగి ఉంటే ఏప్రిల్ 1వ తేదీ కంటే ముందే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆ వాహనాలు ఇక రోడ్డుపై తిరగడానికి అనుమతి ఉండదు. వాహనాల ద్వారా వెలువడే కాలుష్య ఉద్గారాలను బట్టి బీఎస్ స్టాండర్డ్ నిర్ణయిస్తారు. బీఎస్-3,బీఎస్-4 వాహనాల ద్వారా వెలువడుతున్న కాలుష్యం కంటే బీఎస్-6 వాహనాల ద్వారా వెలువడే కాలుష్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం బీఎస్-6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తోంది.
ఇంధన ధరలు ఎందుకు పెరుగుతాయి..
బీఎస్-6 వాహనాల నిబంధనను అమలుచేస్తున్న నేపథ్యంలో.. ఆయా ఆయిల్ కంపెనీలు తమ రీఫైనరీలను అప్డేట్ చేసుకోవడానికి పెద్ద మొత్తంలో ఖర్చుచేశాయి. ఇప్పటిదాకా బీఎస్-3,బీఎస్-4 వాహనాలకు అనుగుణంగా రీఫైనరీల్లో ఇంధన శుద్ది జరగ్గా.. ఇకనుంచి బీఎస్-6 వాహనాలకు అనుగుణంగా ఇంధన శుద్ది చేయాల్సి ఉంటుంది. రీఫైనరీ అప్గ్రేడేషన్ కోసం ఐఓసి రూ .17,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. బిపిసిఎల్ సుమారు రూ.7,000 కోట్లు పెట్టుబడి పెట్టిందని తెలిపింది. ఓఎన్జిసి నిర్వహిస్తున్న హెచ్పిసిఎల్ మాత్రం ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసిందో చెప్పలేదు. అయితే ఏప్రిల్ 1 నుంచి బిఎస్-VI ఇంధనాలను మాత్రమే విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. రీఫైనరీ అప్గ్రేడ్ కోసం ఆయిల్ కంపెనీలు ఖర్చు చేసిన మొత్తం ఇంధన ధరలపై ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో.. ఇంధన ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
బీఎస్-4,బీఎస్-6 మధ్య తేడా ఏంటి..
బీఎస్-4 ఇంధనానికి,బీఎస్-6 ఇంధనానికి ప్రధాన తేడా సల్ఫర్. సల్ఫర్ ఎంత తక్కువగా ఉంటే ఇంధనం అంత శుద్దిగా ఉంటుంది. మిలియన్కు 50 భాగాలు (పిపిఎం) నుంచి 10 పిపిఎమ్ వరకు BS-6 ఇంధనంలో సల్ఫర్ 80% వరకు తగ్గవచ్చునన్న అంచనాలు ఉన్నాయి. తద్వారా డీజిల్ కార్ల నుండి NOx ఉద్గారాలు దాదాపు 70% ,పెట్రోల్ ఇంజన్ కార్ల నుండి 25% తగ్గుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
బీఎస్-6 వాహనాల్లో అది తప్పనిసరి..
బీఎస్-6 వాహనాలను ఉపయోగించేవారు పెట్రోల్ ట్యాంకులో ఎప్పుడూ 2 నుంచి 3 లీటర్ల ఇంధనాన్ని నిల్వ ఉంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే వాహనం నడవదు. మైలేజీ పరంగా బీఎస్-4 కంటే 15శాతం ఎక్కువే ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. నిరంతరం ట్యాంకులో 2 లేదా 3లీటర్ల ఇంధనం ఉంచుకోవడం తప్పనిసరి. బీఎస్-4 వాహనాల్లో కనీస స్థాయిలో ఇంధనం ఉన్నా నడిచే అవకాశం ఉంటుంది. కానీ బీఎస్-6 వాహనాలతో అలాంటి సౌకర్యం లేదు.