ఉగ్రవాదులకు దవిందర్ సింగ్ సాయం: నోరు మెదపరేంటీ..? ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ ధ్వజం
జమ్ముకశ్మీర్ నుంచి ముగ్గురు ఉగ్రవాదులను ఢిల్లీ తరలిస్తూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన డీఎస్పీ దవిందర్ సింగ్ ఘటనపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇంత సీరియస్ ఇష్యూపై ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరు మెదపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశ భద్రతకు సంబంధించిన ఇష్యూపై మౌనంగా ఉండటం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
నోరు మెదపరా..?
దేశ రక్షణకు పర్యవేక్షించే హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రియాక్ట్ కాలేదని రాహుల్ గాంధీ అన్నారు. జాతీయ భద్రతను నిత్యం మానిటర్ చేసే జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కూడా మిన్నకుండిపోయారని విమర్శించారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు. ముగ్గురు ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన దవిందర్ సింగ్.. తన ఇంటిలో వారికి ఆశ్రయం ఇవ్వడమే కాక.. న్యూఢిల్లీ తరలిస్తూ పట్టుబడ్డారని అందులో రాశారు. ఈ ఘటనలో నేరం రుజువైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుచేసి 6 నెలల్లో శిక్ష విధించాలని రాహుల్ గాంధీ కోరారు. జాతీయ భద్రతో ముడిపడిన అంశమైనందున దేశద్రోహానికి పాల్పడ్డారనే అభియోగంపై కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
దేశద్రోహమే..
మరోవైపు ఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ స్థాయి అధికారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో జాతీయ భద్రతపై సందేహాం తలెత్తుందని చెప్పారు. దేశంపై ఉగ్రవాదులు దాడి చేసేందుకు ప్రణాళిక రచిస్తుంటే.. వారికి ఓ పోలీసు అధికారి సాయం చేయడం దేశద్రోహం అని పేర్కొన్నారు.
రాయబారి సహా విదేశీ ప్రతినిధులు..
దవిందర్ సింగ్పై ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. అయితే గతవారం కశ్మీర్ను విదేశీ ప్రతినిధులు సందర్శించిన సమయంలో వారి భద్రతను దవిందర్ సింగ్ పర్యవేక్షిచడం విశేషం. అమెరికా రాయబారి సహా 15 మంది విదేశీ ప్రతినిధులను శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత దవిందర్ సింగ్ ఇంటిలో దాడులు నిర్వహిస్తే ఏకే 47 రైఫిల్ లభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రియాంక గాంధీ దవిందర్ సింగ్కు కీలకమైన బాధ్యతలు ఎలా అప్పగించారని ప్రియాంకగాంధీ ప్రశ్నించారు.
పోలీసుల మృతిపై..
ఆర్మీ 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయం సమీపంలో గల తన అధికార నివాసంలో దవిందర్ సింగ్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారు. వారు శనివారం జమ్ముకశ్మీర్ నుంచి ఢిల్లీ బయల్దేరగా.. పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రిపబ్లిక్ డే వేడుకల కోసం దవిందర్ ఢిల్లీ వెళ్తున్నారా ? లేదంటే ఉగ్రవాదులను దింపేందుకు వెళ్తున్నారా అనే అంశంపై విచారణ కొనసాగుతోంది. 2017లో పుల్వామాలో నలుగురు పోలీసుల మృతికి సంబంధించిన ఘటనలో దవిందర్ సింగ్ పాత్రపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.