మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించారో తెలుసా? సహేతుకమైన కారణాలివే..
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలు అటు ఇటు తిరిగి చివరకు రాష్ట్రపతి పాలనకు దారితీశాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి తగిన మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యంగా మారింది. మిత్రపక్షాలైన బీజేపీ, శివసేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ప్రారంభమైంది అసలు రాజకీయం.
ఆపరేషన్ కమలం: మహారాష్ట్ర.. మరో కర్ణాటక అవుతుందా? శరద్ పవార్ ఆందోళనకు కారణాలేంటీ?
మొదట తేల్చేసిన బీజేపీ
ముఖ్యమంత్రి పదవి కావాలంటూ శివసేన పట్టుబట్టడంతో బీజేపీ అందుకు నిరాకరించింది. అయితే, మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆహ్వానించారు. అయితే, తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత బలం లేదని, తమ మిత్ర పక్షం శివసేన తమతో కలిసి రావడం లేదని.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని గవర్నర్కు స్పష్టం చేసింది బీజేపీ.
శివసేన ఆ తర్వాత ఎన్సీపీ
ఆ తర్వాత ఎక్కువ సీట్లు గెలుచుకున్న శివసేనను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా పిలిచినా.. ఆ పార్టీ మరింత గడువు కోరడంతో గవర్నర్ అందుకు నిరాకరించారు. చివరకు మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎన్సీపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించారు. మంగళవారం రాత్రి 8.30గంటలోపు చెప్పాలంటూ ఎన్సీపీకి గవర్నర్ గడువు విధించారు. అయితే, గడువు పూర్తికాకముందే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీలు గవర్నర్ తీరుపై విమర్శలు గుప్పించాయి. ఇచ్చిన సమయం కూడా ఆగలేదని మండిపడ్డాయి.
రాష్ట్రపతి పాలనకు దారితీసిన పరిణామాలు
ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రపతి పాలన విధించడానికి దారితీసిన పరిణామాలను వివరించింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ బీఎస్ కోశ్యారీ అన్ని విధాలా ప్రయత్నించినా.. ఆ దిశగా సానుకూల ఫలితాలు రాలేదని, ఏ పార్టీకి సరైన సంఖ్యా బలం లేకపోవడంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రపతి పాలనే మార్గమనే నిర్ణయానికి గవర్నర్ వచ్చారని స్పష్టం చేసింది. అందుకే కేంద్రానికి సిఫారసు చేశారని పేర్కొంది.
ఆ పరిస్థితులు లేకపోవడంతో..
‘మంగళవారం ఉదయం 11.30గంటలకు ఎన్సీపీ నేతలు గవర్నర్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యాబలం సమకూర్చుకునేందుకు మూడు రోజుల గడువు ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని పేర్కొంటూ ఏ రాజకీయ పక్షం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు లేవని గ్రహించిన గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు' అని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.
రాష్ట్రపతి ఆమోద ముద్రతో..
కాగా మంగళవారం మధ్యాహ్నం గవర్నర్ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆ తర్వాత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు సిఫారసు చేసింది. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేశారన్న విషయం నివేదికలో ఎక్కడా లేదని స్పష్టం చేసింది. కేబినెట్ సిఫారసుతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఆరు నెలలపాటు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. కాగా, రాష్ట్రపతి పాలన విధించడంపై శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. బుధవారం దీనిపై సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది.