పార్లమెంట్: ముందుకొచ్చిన రాహుల్, ‘షేమ్ షేమ్’ అని
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అప్పుడప్పుడు నిల్చుని నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు రాహుల్ నాయకత్వం వహిస్తున్నట్లుగా వారి నినాదాలకు మద్దతు పలికారు.
ఇటీవల జరిగిన పార్లమెంటు తొలి సమావేశాల్లో చివరి బెంచీలో కూర్చున్న రాహుల్ గాంధీ.. సోమవారం జరిగిన సమావేశాల్లో ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బెంచీకి ముందు నిల్చుని నిరసన తెలిపారు. ఈ సమావేశాల్లో రాహుల్ గాంధీ మూడో వరుస బెంచీలో కూర్చున్నారు.
కాగా, ఈ విషయంపై స్పందించమని కోరగా.. భారతీ జనతా పార్టీ నాయకుడు రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ.. ఈ రోజు తనకు ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాతైనా రాహుల్ గాంధీ నుంచి పలు ఇంగ్లీష్ పదాలు వినిపించాయని వ్యంగ్యంగా అన్నారు. షేమ్ షేమ్ అనే పదాలు అతని నుంచి వచ్చాయని తెలిపారు. ఈ రోజు సమావేశాలు చాలా కొత్తగా ప్రారంభమయ్యాయని చెప్పిన ఆయన, రాహుల్ గాంధీ షేమ్ షేమ్ అంటూ ప్రారంభించారని అన్నారు. ప్రజలు ఇదంతా చూస్తున్నారని తెలిపారు.
అయితే రాహుల్ గాంధీ ఎలాంటి నినాదాలు చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు. రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఒక చురుకైన వాడని మరో సీనియర్ కాంగ్రెస్ నేత కమల్నాథ్ అన్నారు.