మోడీ పిలుపు ‘జనతా కర్ఫ్యూ’కు రజినీకాంత్ మద్దతు: సూపర్ స్టార్ ట్వీట్ వీడియో డిలీట్, ఎందుకంటే?
చెన్నై: సూపర్ స్టార్ రజినీకాంత్ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూకు మద్దతుగా ఓ ట్వీట్ చేశారు. కరోనా కట్టడి కోసం జనతా కర్ఫ్యూలో దేశ ప్రజలంతా పాల్గొనాలని కోరారు. అయితే, ట్విట్టర్ మాత్రం ఈ ట్వీట్ను డిలీట్ చేసింది. ఇందులో ఎలాంటి వివాదాస్పద అంశం లేనప్పటికీ ట్విట్టర్ ఆయన ట్విట్ డిలీట్ చేయడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
జనతా కర్ఫ్యూ పాటించాలంటూ రజినీకాంత్..
‘ప్రస్తుతం మన దేశంలో వైరస్ రెండో దశలో ఉంది. మూడో దశకు చేరకుండా ఉండాలంటే అందరూ జనతా కర్ఫ్యూ పాటించాలి. 12-14 గంటలపాటు ఇంట్లోనే ఉండటం వల్ల వైరస్ గాలిలో వ్యాప్తిచెందే అవకాశం తగ్గిపోతుంది. ఇటలీలో ఈ తరహా కర్ఫ్యూపై అలసత్వం వహించడం వల్లే భారీ మూల్యం చెల్లించుకుంటోంది. కాబట్టి మనందరం ఆదివారం ఇళ్లలోనే ఉందాం' అని ట్విట్టర్ వేదికగా రజినీకాంత్ పిలుపునిచ్చారు.
అందుకే రజినీ ట్వీట్ తొలగింపు..
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో ప్రజలంతా అందులో భాగస్వాములు కావాలని కోరుతూ రజినీకాంత్ చేసిన ఈ వీడియో ట్వీట్ను కొందరు తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశారు. నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఈ క్రమంోలనే ట్విట్టర్ రజినీ ట్విట్ను తొలగించేసింది. జనతా కర్ఫ్యూ కోసం దేశ ప్రజలంతా మద్దతు పలుకుతున్న నేపథ్యంలో కొందరు ఇలాంటి పనులకు పూనుకోవడం విచారకరం. కాగా, ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీధి మాయమ్ అధినేత కమలహాసన్ కూడా ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనా బారినపడకుండా ఉండాలని పిలుపునిచ్చారు.
జనతా కర్ఫ్యూకు అనూహ్య మద్దతు
ఇక కరోనా కట్టడిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూకు దేశ ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. స్వచ్ఛందంగా ప్రజలంతా తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో దేశంలోని నగరాలు, పట్ణణాలన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. తెలంగాణ సహా పలు రాష్ట్రాలు 24 గంటల కర్ఫ్యూను నిర్వహించాలని ప్రజలను కోరాయి. కాగా, కరోనా మృతుల సంఖ్య దేశంలో ఆరుకు చేరింది. ఆదివారం ఒక్క రోజే ఇద్దరు మరణించారు. దేశంలో మొత్తం 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా 11వేలకు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. రెండున్నర లక్షల మంది కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.