పబ్లిక్గా..: ఆరెస్సెస్ నిక్కర్ల పైన రబ్రీదేవి కామెంట్
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఆదివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ పైన విమర్శలు గుప్పించారు. ఆరెస్సెస్ వారు హాఫ్ నిక్కర్లు ఎందుకు వేసుకుంటారని ఆమె ప్రశ్నించారు.
వారు లాఠీలు పట్టుకోవడాన్ని కూడా ఆమె ప్రశ్నించారు. ఆమె ఆదివారం నాడు ఆర్జేడీ జాతీయ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆరెస్సెస్, బిజెపి వాళ్లు లాఠీ పట్టుకుంటారని, అలాంటి వారే తిరిగి తమను ప్రశ్నించడం విడ్డూరమన్నారు.
ఓ ర్యాలీలో ఆర్జేడీ కార్యకర్తలు లాఠీలు పట్టుకున్నారు. దీనిపై బిజెపి నేతలు చురకలు వేశారు. దీంతో రబ్రీదేవి స్పందిస్తూ.. ఆరెస్సెస్ వాళ్లు లాఠీలు పట్టుకుంటారని, కానీ బిజెపి నేతలు తమను విమర్శించడం ఏమిటని ఆమె అభిప్రాయపడ్డారు. బహిరంగంగా వారు హాఫ్ పాయింట్లు (నిక్కర్లు) వేసుకోవడం సిగ్గుచేటు అన్నారు.
బీహార్లో ఆర్జేడీ - జెడియు - కాంగ్రెస్ మిత్రపక్షాల ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి. దీనిపై రబ్రీదేవి మాట్లాడుతూ... నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాగత్బందన్ మరో ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటుందని చెప్పారు. అయితే, మనలో ఒకరు ఎదుగుతుంటే మరొకరు కాళ్లు లాగే ప్రయత్నం చేయవద్దన్నారు.