ఎన్కౌంటర్పై త్రిసభ్య కమిటీ వెనక? మరో సంస్థ విచారణ ఎందుకు వద్దంటే, సుప్రీంకోర్టు
దిశపై లైంగికదాడి చేసి క్రూరంగా హతమార్చిన నలుగురు నిందితుల మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు ఎన్కౌంటర్ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో హైకోర్టు న్యాయమూర్తి ఒకరు, సీబీఐ మాజీ డైరెక్టర్కు కూడా చోటు కల్పించింది. ఘటనపై ఇప్పటికే సిట్ విచారిస్తోండగా, ఎన్హెచ్ఆర్సీ సభ్యులు ఎంక్వైరీ చేయగా రిటైర్డ్ జడ్జీతో విచారణ ఎందుకు జరిపించాల్సి వచ్చిందనే ప్రశ్న తలెత్తుతుంది.
దిశ నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం, ముగ్గురు సభ్యులతో కమిటీ, 6నెలల గడువు
ఏం జరిగింది...?
దిశ ఎన్కౌంటర్ ఘటనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సీరియస్గా తీసుకుంది. నిజనిజాలు వెలికితీయాలని భావించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విచారణలో నిజం బయటపడదని భావించింది. అందుకోసమే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సిర్పుర్కర్ నేతృత్వంలో కమిటీని నియమించింది. వీరికి ఆరునెలల గడువు విధించింది. దీంతోపాటు మీడియా కవరేజ్ ఉండొద్దని స్పష్టంచేసింది. మీడియా కవరేజ్ చేస్తే అసలు విషయం కన్నా కొసరు విషయానికే ప్రాధాన్యం ఇస్తారని భావించి ఉంటుంది.
న్యాయనిపుణులు
సిర్ పుర్కర్ చైర్మన్గా సభ్యులుగా బాంబే హైకోర్టు మాజీ జడ్జీ రేఖా, సీబీఐ మజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉన్నందున.. ఇతర దర్యాప్తు సంస్థలు విచారించొద్దని స్పష్టంచేసింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ ప్రక్రియ పూర్తయ్యింది. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నేతృత్వంలో వేసిన సిట్ ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ఈ లోపు వారి విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది.
ఖర్చులు భరించాలి
కమిటీకి సీఆర్పీఎఫ్తో భద్రత కల్పించాలని.. కమిషనర్ ఖర్చులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని తేల్చిచెప్పింది. ఎన్కౌంటర్పై పోలీసులు తప్పుచేశారని అనడం లేదు కానీ.. విచారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
మరో సంస్థ వద్దు
న్యాయ నిపుణులతో కూడా కమిటీ విచారిస్తోన్నందున మరో సంస్థ ఎంక్వైరీ అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం భావించింది. అందుకోసమే సిట్ ఇతర సంస్థలు కల్పించుకోవద్దని సూచించింది. ఇప్పటివరకు తమ పరిధిలోకి వచ్చిన అంశాలను సిట్.. విచారణ కమిటీకి అప్పగించాలని కోరింది. కమిటీ నిష్పాక్షిపాతంగా దర్యాప్తు జరిపి, నిర్ణీత సమయంలో నివేదిక అందజేయనుంది. నివేదిక ఆధారంగా ఎన్కౌంటర్ చేసిన పోలీసులు, ఆదేశాలు ఇచ్చిన పెద్దలపై చర్యలు ఉండే అవకాశం ఉంది.