రజనీ, కమల్, విశాల్ మౌనం, కాలేజ్ విద్యార్థుల వార్నింగ్, తమిళనాడులో మరో ఉద్యమం !
చెన్నై: తమిళనాడులో విద్యార్ధుల ఆందోళనతో మరో ఉద్యమం మొదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే ఆర్ టీసీ బస్సు చార్జీలు తగ్గించకపోతే జల్లికట్టు తరహాలో ఉద్యమం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాలేజ్ విద్యార్థులు మంగళవారం రెండో రోజూ ఆందోళనకు దిగారు. బస్సు చార్జీల విషయంలో హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, విశాల్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
ఊహించని షాక్
తమిళనాడు ప్రభుత్వం ఆరు సంవత్సరాల తరువాత ఏకంగా 67 శాతం బస్సు చార్జీలు పెంచి ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చింది. ఆర్ టీసీ బస్సు చార్జీలు పెంచిన ప్రభుత్వం వెంటనే వాటిని అమల్లోకి తీసుకురావడంతో ప్రజలు, ప్రయాణికులు ఆందోళనకు గురైనారు.
గ్రామీణ
రూ.1 టిక్కెట్ రూ. 6, నగరాల్లోని లోకల్ బస్సుల్లో రూ. 1 నుంచి టిక్కెట్ ధరలు మొదలు అయ్యేవి. అయితే ఇప్పుడు రూ. 1 టిక్కెట్ ధర రూ. 6 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే ఆర్ టీసీ బస్సు చార్జీల ధరలు అమలులోకి రావడంతో ప్రయాణికులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
రజనీ, కమల్, విశాల్
రాజకీయాల్లోకి వస్తున్నామని ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్, బహుబాష నటుడు కమల్ హాసన్, ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసి పోటీ చెయ్యడానికి విఫలయత్నం చేసిన హీరో విశాల్ ఆర్ టీసీ బస్సు చార్జీల విషయంపై ఇప్పటి వరకూ నోరు మెదపలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వినోదపు పన్ను !
తమిళ సినిమా నిర్మాతల మండలి అధ్యక్షుడు, హీరో విశాల్ వినోదపు పన్ను మినహాయించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని కలిసి మనవి చేశారు. అయితే ఇప్పుడు ప్రజలు ఆర్ టీసీ బస్సు చార్జీల విషయంలో ఆందోళన చేస్తుంటే హీరో విశాల్ ఎందుకు పట్టించుకోవడం లేదని, ఆయనకు సినిమాల మీద మాత్రమే ప్రేమ ఉందని, ప్రజల కష్టాల మీద ఎలాంటి శ్రద్దలేదని మండిపడుతున్నారు.
కాలేజ్ విద్యార్థుల వార్నింగ్
జల్లికట్టు విషయంలో చెన్నై మెరినాబీచ్ లో గత సంవత్సరం కాలేజ్ విద్యార్థులు మెరుపు ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. ఆర్ టీసీ బస్సు చార్జీలు తగ్గించకుంటే జల్లికట్టు తరహాలో మరో ఉద్యమం చేస్తామని కాలేజ్ విద్యార్థులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.