నన్నే టార్గెట్ చేస్తున్నారేం: 'విషాదం'పై హేమమాలిని
లక్నో: మధురలో జరిగిన ఘటన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని, అసలు అంశాన్ని పక్కదారి పట్టించి తనను ఎందుకు ఆడిపోసుకుంటున్నారని సినీ నటి, ఎంపీ హేమమాలిని అన్నారు. శనివారం మధురలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు హేమమాలిని నేతృత్వం వహించారు.
ఘటన జరిగిన వెంటనే దానిపై స్పందించకుండా ముంబైలో సినిమా షూటింగ్కు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆమె విమర్శల పాలయ్యారు. ఓ వైపు సొంత నియోజకవర్గంలో ఇంత ప్రమాదం జరిగితే ఆమె ట్విట్టర్లో ఫోటోలు పోస్ట్ చేయడాన్ని చాలామంది తప్పుబట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, అందరూ తన ట్వీట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయించే ముందు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాల్సిందన్నారు.
అక్కడున్న మూడు వేల మంది దగ్గర ఆయుధాలు ఉన్న విషయం పోలీసులకు తెలుసునని చెప్పారు. కానీ వాళ్లు ఈ దారుణ ఘటన జరగకుండా నివారించలేకపోయారన్నారు. ఘటనలో చనిపోయిన ఎస్పీ ముకుల్ ద్వివేదీ కుటుంబాన్ని హేమ పరామర్శించారు. మరోవైపు ఘటనపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ నిష్పక్షపాత దర్యాప్తు జరిపిస్తామన్నారు.