పరీక్షకు బుర్కా ఎందుకు..?ఆంక్షలు పెట్టిన పోలీసులు..! విద్యాశాఖకు ఫిర్యాదు చేసిన ముస్లిం యువతి..!
పనాంజి/ హైదరాబాద్ : మొన్నతెలంగాణలో పోటీ పరీక్షలకు హాజరైన వివాహిత కు సెక్యూరిటి సిబ్బంది నుంచి ఎదురైన చేదు అనుభవం మర్చిపోక ముందే అలాంటి సంఘటనే గోవా లో జరిగింది. తెలంగాణ టీఎస్పీఎస్సీ ఆద్వర్యంలో జరిగిన పరీక్షకు వివాహితల మంగళసూత్రాలను కూడా పరీక్షా కేంద్రంలోకి పోలీసులు అనుమతించలేదు. దీంతో తాళి బొట్లు తీసి కొంత మంది పరీక్షకు హాజరైతే అవి తీయడానికి నిరాకరించిన కొంత మంది మహిళలు పరీక్షనే రద్దు చేసుకున్నారు. ఇంచుమించు అలాంటి ఘటనే గోవాలో చోటుచుసుకుంది. భారత దేశంలో ముస్లిం మహిళలు పరమ పవిత్రంగా భావించే బుర్కా ను పరీక్షా కేంద్రానికి అనుమతించకుండా పోలిసులు చేసిన ఓవర్ యాక్షన్ కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుర్కా (ముస్లిం యువతులు ధరించే ముసుగు) ధరించడంతో విద్యార్థినిని ఎన్ఈఈటి(నీట్) పరీక్షకు అనుమతించలేదు. గోవాలో ఇటీవల జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
24ఏళ్ల వయసున్న పిజి విద్యార్థిని, రచయిత అయిన సఫినా ఖాన్ సౌదాఘర్ గత వారంలో నీట్ పరీక్షకు హాజరైంది. ఆమె ధరించిన బుర్కాను తీసివేయాల్సిందిగా అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కోరారు. అందుకు ఆమె నిరాకరించడంతో పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో ఆమె విద్యాశాఖకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ఆమె మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు, రాష్ట్ర మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసింది. తనిఖీల పేరుతో విద్యార్థినులను వేధిస్తున్నారని, వారి బెల్ట్స్, క్లిప్స్, ఆభరణాలు కూడా తీసివేయిస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రకారం అందరిపట్ల సమానంగా వ్యవహరించాలని, ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛను హరించ కూడదని, ఆర్టికల్ 25-26 ప్రకారం మతస్వేచ్ఛను కాపాడుకునే హక్కు ఉందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాని లౌకిక దేశంలో వాటిని అంగీకరించడం లేదని, వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గోవాలో జరిగిన సఫీనా సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం అవుతోంది.