ఈడీ అటాచ్ : చింపాంజీలు, కోతులను కూడా వదిలి పెట్టలేదు!
కోల్ కత: సాధారణంగా ఆర్థిక నేరాలకు పాల్పడిన వారి ఆస్తులను అటాచ్ చేస్తుంటారు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు. నిందితుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తుంటారు. ఆర్థికంగా దిగ్బంధిస్తుంటారు. పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్న ఓ కేసు దర్యాప్తునకు సంబంధించిన ఘటనలో ఈడీ అధికారులు ఏకంగా వన్యప్రాణులను సైతం వదిలి పెట్టలేదు. వాటిని కూడా అటాచ్ చేశారు. మూడు చింపాంజీలు, నాలుగు అరుదైన కోతులను ఈడీ అధికారులు జప్తు చేశారు. వాటి సంరక్షణ బాధ్యతలను అలీపూర్ జులాజికల్ పార్క్ అధికారులకు అప్పగించారు. పశ్చిమ బెంగాల్ రాజధానిలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటన ఈడీ చరిత్రలోనే తొలిసారి. గతంలో ఎప్పుడూ ఇలా వన్యప్రాణులను జప్తు చేసిన రికార్డు ఈడీకి లేదు.
కోల్ కతకు చెందిన సుప్రదీప్ గుహ ఓ స్మగ్లర్. వీరప్పన్ తరహాలో అటవీ జంతువులను స్మగ్లింగ్ చేస్తుండే వాడు. చింపాంజీలు, అరుదైన జాతికి చెందిన మర్మోసెట్ అనే నాలుగు కోతులను అక్రమంగా దేశం దాటించే క్రమంలో పోలీసులు, అటవీశాఖ అధికారులు చేతికి చిక్కాడు. పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా అతని నివాసంపై దాడులు చేశారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అటవీ జంతువుల స్మగ్లింగ్ మాత్రమే కాకుండా.. సుప్రదీప్ గుహకు మరిన్ని ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. దీనితో ఈడీ అధికారులు రంగప్రవేశం చేశారు.
జంతువులను అక్రమంగా రవాణా చేయడానికి పశ్చిమ బెంగాల్ అటవీశాఖ నుంచి అనుమతులు పొందినట్లు ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించినట్లు తేలింది. అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సంతాకాన్ని అతను ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు. అక్రమంగా తరలించడానికి సిద్ధం చేసిన మూడు చింపాంజీ, నాలుగు మార్మోసెట్లను అధికారులు అటాచ్ చేశారు. వాటిని అలీపూర్ జూపార్కునకు అప్పగించారు. ఒక్కో చింపాంజీ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో 25 లక్షల రూపాయలకు పైగా పలుకుతోందని వెల్లడించారు. అలాగే ఒక్కో మార్మోసెట్ ను సుమారు రెండు లక్షల రూపాయలకు విక్రయించేలా బేరం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. మనీ లాండరింగ్ కేసు కింద సుప్రదీప్ గుహను అరెస్టు చేశారు.