మనం ఇచ్చింది ప్రకృతి తిరిగిచ్చింది!: కేరళ జలవిలయానికి కారణం ఏమిటి?
తిరువనంతపురం: కేరళలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 350 మందికి పైగా మృతి చెందారు. రూ.20వేల కోట్ల వరకు నష్టం జరిగింది. కేరళ వరద బాధితులకు పెద్ద ఎత్తున సహాయం అందుతోంది. ఎంతోమంది ఉదారత చాటుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు, ఏపీ ప్రభుత్వం రూ.10 కోట్లు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రూ.15 కోట్లు.. ఇలా ఎన్నో రాష్ట్రాలు ఇస్తున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు స్పందిస్తున్నారు.
కేరళకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తమవంతుగా దుస్తులు, నీరు, ఔషధాలు తదితర 500 టన్నుల అవసరమైన సామగ్రిని 60 ట్రక్కుల్లో కేరళకు పంపించింది. వాటి మొత్తం విలువ రూ.9.35 కోట్లు ఉంటుందని తెలిపింది. ఇప్పటికే సంస్థ తరఫున వెయ్యిమందికి పైగా స్వచ్ఛంద సేవకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపింది. జమ్ము కాశ్మీర్ బ్యాంకు సిబ్బంది రూ.11 కోట్ల విరాళం ప్రకటించింది. అయితే, కేరళ భారీ నష్టానికి కారణాలపై చర్చ సాగుతోంది. ఇంత జలవిలయం ఎందుకు అంటే ఎన్నో కారణాలు చెబుతున్నారు.
కేరళకు యూఏఈ రూ.700 కోట్ల సాయం: 10ని.ల్లో జెండా ఎగురవేస్తారనగా.. యువతి కంటతడి
వర్షం ఎక్కువ కురిస్తే నదులు పొంగుతాయి
కేరళ విపత్తుకు భౌగోళిక అననకూలత, అత్యధిక జనసాంధ్రత, కుండపోత వర్షాలు, జల నిర్వహణ లోపాలు, ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం, పెద్ద ఎత్తున భవనాల నిర్మాణాలు.. ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. కేరళకు దాదాపు 600 కిలో మీటర్ల మేర అరేబియా సముద్ర తీరప్రాంతం ఉంది. చిన్న నదులు అరేబియాలో కలుస్తాయి. ఈ నదులకు పరీవాహక ప్రాంతం చాలా తక్కువ. దీంతో వర్షం కాస్త ఎక్కువ కురిస్తే నదులు పొంగుతాయి. అలాగే, కేరళ భౌగోళిక ప్రాంతం దాదాపు పది శాతం మేర సముద్ర మట్టానికి దిగువన ఉంటుంది. రాష్ట్రంలోని చాలా భాగాలు లోతట్టులో ఉంటాయి. అవాసాలు పర్వత వాలుల్లో ఉన్నాయి.
జనసాంధ్రత, జలనిర్వహణ
కేరళలో జలనిర్వహణ బాగా లేదని చెబుతున్నారు. హిమాలయేతర రాష్ట్రాల్లో కేరళ ఎంతో వెనుకబడి ఉంది. మిగులు జలాలను పంపిణీ చేయడంలో కీలకంగా ఉన్న చిన్న కాలువలను సరిగా నిర్వహించడం లేదని నీతి ఆయోగ్ చెప్పింది. అంతేకాకుండా ఇక్కడ జనసాంధ్రత ఎక్కువ. జాతీయ సగటు కంటేఇక్కడ ఎక్కువ. జనసాంధ్రత ప్రాంతాల్లో వరదలు సంభవించినప్పుడు ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది.
ప్రకృతికి హాని చేస్తూ
భారీ వర్షాల కారణంగా పలు ఆనకట్టల్లో సామర్త్యం కంటే ఎక్కున నీటిని నిల్వ చేశారు. ఇడుక్కి ఆనకట్ట గేట్లను దాదాపు 26 ఏళ్ల తర్వాత తెరిచారు. ఓ వైపు ఆనకట్టల నుంచి వచ్చిన నీరు, మరోవైపు భారీ వర్షం కారణంగా రాష్ట్రం వరదమయంగా మారింది. వేగంగా పట్టణీకరణ జరుగుతోంది. దీంతో చెట్లను నరికి వేస్తున్నారు. అభివృద్ధి పేరిట పడమటి కనుమలకు హాని చేస్తున్నారు. క్వారీలు, గనులు తవ్వుతున్నారు. దీంతో ఇక్కడి ప్రాంతాలు బాగా దెబ్బతింటున్నాయి. మనం ప్రకృతికి ఏమిచ్చామో, అది మనకు తిరిగి ఇస్తోందంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారీ కుంభవృష్టి
కేరళలో వరదల ముందస్తు హెచ్చరికల కేంద్రం లేదు. రాష్ట్రంలో నదులు పొంగే సమయం చాలా వేగంగా ఉంటుంది. పలు రాష్ట్రాల్లో ఒకరోజు ముందు హెచ్చరికలు చేస్తారు. కేరళలో మాత్రం కనీసం గంటల ముందు కూడా చేయలేని పరిస్థితి. కేరళలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. గత వందేళ్లలో కురవని వర్షాలు పడటం కూడా ఈ నష్టానికి కారణం.