బయట గంభీరంగా..లోపల అనుమానంగా: అందుకే ఓపెన్ బ్యాలట్ ఓటింగ్కు కూటమి పట్టు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్కు షాకిస్తూ బలనిరూపణ అనేది ఓపెన్ బ్యాలట్ విధానంలో జరగాలంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అది కూడా ప్రత్యక్ష ప్రసారం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఇక ఇదంతా ప్రొటెం-స్పీకర్ పర్యవేక్షణలో జరగాలంటూ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ మొత్తం ప్రక్రియ బుధవారం సాయంత్రం 5 గంటలకల్లా చేపట్టాలని ఆదేశించింది. అయితే ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేనలకు సంబంధించిన మహా వికాస్ అగాడీ కూటమి బహిరంగ ఓటింగ్ విధానం ద్వారా బలనిరూపణ జరగాలని కోర్టును అడిగింది. అయితే కోర్టు ఇందుకు ఓకే చెప్పింది. మహా వికాస్ అగాడీకి 162 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ... ఎందకు ఓపెన్ బ్యాలెట్ విధానం కావాలంటూ నొక్కి చెప్పింది అనేదానిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది.
బహిరంగ బ్యాలట్ ఓటింగ్ విధానంకు పట్టు
మహారాష్ట్ర రాజకీయాలు గంటగంటకు మారుతున్నాయి. ఆదివారం నుంచి మహా పంచాయతీ సుప్రీంకోర్టులో ఉండగా మంగళవారం దీనికి తెరపడింది. ఫడ్నవీస్ బుధవారం సాయంత్రంలోగ బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో మహావికాస్ అగాడీ తరపున వాదించిన సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వీ... ఓటింగ్ బహిరంగ బ్యాలట్ పద్ధతిలో జరగాలని కోరగా అందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇప్పుడు ఇది ఒకరకంగా బీజేపీకి ఇబ్బందికరంగా మారనుండగా అదే సమయంలో ఎమ్మెల్యేలకు కూడా ఇబ్బందికరంగా మారనుంది.
బలనిరూపణ ఎన్ని విధాలుగా చేపట్టొచ్చు..?
బలనిరూపణను మూడు పద్ధతుల ద్వారా నిర్వహించొచ్చు. ఒకటి వాయిస్ ఓటింగ్ ద్వారా అంటే ప్రజాప్రతినిధులు తాము ఎవరికి మద్దతు ఇస్తున్నారో మౌఖికంగా స్పందించాల్సి ఉంటుంది.ఒవేళ డివిజన్ ఓటింగ్ జరపాలని భావిస్తే అది ఎలక్ట్రానిక్ పద్ధతుల ద్వారా లేదా బ్యాలట్ బాక్సుల్లో స్లిప్పులు వేయడం ద్వారా జరుగుతుంది. అయితే బ్యాలట్ ఓటింగ్ అనేది మూడో ప్రక్రియ. ఇది సాధారణ ఎన్నికల సందర్భంగా ఓటరు ఎలాగైతే తన ఓటును రహస్యంగా వినియోగించుకుంటాడో అలాంటి పద్దతినే ఇక్కడ అవలంబిస్తారు.
ఓపెన్ బ్యాలట్ విధానం ఎలా ఉంటుంది..?
ఇక ఓపెన్ బ్యాలట్ విధానంకు వస్తే , ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు వారు ఎవరికి మద్దతు తెలుపుతున్నారో చెప్పే బ్యాలట్ పేపర్ను అక్కడే రిప్రజెంటేటివ్గా కూర్చున్న పార్టీ ప్రతినిధికి చూపించాల్సి ఉంటుంది. ఓటింగ్ పారదర్శకతతో జరిగేలా చూడటం కోసమే ఈ పద్ధతిని పాటిస్తారు. ఇక బుధవారం జరిగే బలనిరూపణ సందర్భంగా ఓపెన్ బ్యాలట్ ఓటింగ్ విధానం చాలా కీలకంగా మారనుంది. సభ్యులు క్రాస్ ఓటింగ్కు పాల్పడే అవకాశం ఉన్నందున అలాంటిది జరగకుండా ఉండేందుకే ఈ విధానంను పాటిస్తారు.
సభలో హాజరైన వారితోనే బలనిరూపణ
బలనిరూపణ అనేది రాజ్యాంగంను అనుసరించి జరుగుతుంది. ఇది సాధారణంగా ఫలానా ప్రభుత్వానికి ఎమ్మెల్యేల మద్దతు ఉందా లేదా అనేదానికి జరుగుతుంది. రాష్ట్రపరిధిలో అయితే అసెంబ్లీలో కేంద్ర పరిధిలో అయితే పార్లమెంటులో జరుగుతుంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తితో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. సాధారణంగా ఆ వ్యక్తి సింగిల్ లార్జెస్ట్ పార్టీ నుంచి కానీ ఇతర పార్టీల మద్దతుతో కానీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ముందుకొస్తే అతనితో లేదా ఆమెతో ముఖ్యమంత్రిగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక సభలో బలనిరూపణకు కాస్త సమయం ఇస్తారు. ఇక వివిధ కారణాలతో సభకు హాజరుకాని ఎమ్మెల్యేలు లేదా ఓటింగ్కు దూరంగా ఉండాలని భావించే ఎమ్మెల్యేల విషయం పక్కనపెడితే సభలో ఎంతమంది ఉన్నారు ఎందరు ఓటింగ్లో పాల్గొని సీఎంకు మద్దతుగా నిలిచారు అనేదాన్నే లెక్కలోకి తీసుకుంటారు.
క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందా..?
ఇక మహారాష్ట్ర విషయానికొస్తే ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్లతో కూడిన మహా వికాస్ అగాడీకి 162 మంది ఎమ్మెల్యేల బలం ఉందని ఆ కూటమి చెబుతోంది. దీన్నే ధృవీకరిస్తూ ముంబైలోని ఓ హోటల్లో ఎమ్మెల్యేలతో పరేడ్ కూడా నిర్వహించారు. అదే సమయంలో బీజేపీ ఎత్తుగడలకు ప్రలోభాలకు తలొగ్గమని ప్రమాణస్వీకారం చేశారు. ఇక్కడ ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు సభలో గట్టిగా నిలబడగలరా అనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే బయట ఒకలా చెప్పి సభలో మరోలా సభ్యులు ఓటువేసిన ఘటనలను చాలా చూశాం. అందుకే 162 మంది సభ్యులు బలం ఉన్నప్పటికీ మహావికాస్ అగాడీ తరపున సుప్రీంకోర్టులో వాదించిన లాయర అభిషేక్ సింఘ్వీ ఓపెన్ బాలెట్ విధానంకు పట్టుబట్టినట్లు తెలుస్తోంది.