థియేటర్లలో జాతీయ గీతానికి 1975లో ఫుల్స్టాప్.. ఎందుకు?
1975కి ముందు రోజుల్లో సినిమా ప్రదర్శన అయిపోయిన తర్వాత థియేటర్లలో జాతీయ గీతాన్ని ఆలపించడం ఓ సాంప్రదాయంగా కొనసాగుతుండేది.
న్యూఢిల్లీ : సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని ప్రదర్శించడం మరిము జాతీయ జెండాను స్క్రీన్ పై ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. థియేటర్ లో సినిమా ప్రారంభానికి ముందు ఈ రెండు నిబంధనలను థియేటర్ యాజమాన్యాలు కచ్చితంగా పాటించి తీరాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.
జాతీయ గీతం ప్రసారం చేసే సమయంలో థియేటర్ లోని ప్రేక్షకులంతా గౌరవప్రదంగా నిలబడి ఉండాలని సూచించింది. ఈ తీర్పు ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్నప్పటికీ..1975కి ముందు థియేటర్లలో జాతీయ గీతాన్ని ప్రదర్శించేవారు. అప్పట్లో జాతీయ గీతాన్ని ప్రసారం చేయడం ప్రయోగాత్మకంగా థియేటర్లలో చేపట్టినప్పటికీ.. ఆచరణలో ఎదురైన కొన్ని ఇబ్బందుల వల్ల 1975లో దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు.
1975కి ముందు రోజుల్లో సినిమా ప్రదర్శన అయిపోయిన తర్వాత థియేటర్లలో జాతీయ గీతాన్ని ఆలపించడం ఓ సాంప్రదాయంగా కొనసాగుతుండేది. అయితే జాతీయ గీతాన్ని ప్రసారం చేస్తున్న సమయంలో చాలామంది ప్రేక్షకులు నిలబడికుండా ఉండిపోవడం ఘటనలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితిని జాతీయ గీతానికి అవమానకరంగా భావించడంతో ఈ పరంపరకు తెరపడింది.
ఇదే విషయానికి సంబంధించి దాఖలైన ఓ పిటిషన్ పై 2015లో మద్రాస్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. థియేటర్లలో జాతీయ గీతాన్ని ప్రసారం చేయడం సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించనట్టవుతుందని, ఈ విషయంలో ప్రేక్షకుడు గౌరవ ప్రదంగా వ్యవహరించడం కన్నా గందరగోళపడే అవకాశం ఎక్కువగా ఉందని కోర్టు పేర్కొనడం గమనార్హం.