బంగారం ధరలు అమాంతంగా పెరగడానికి కారణమేంటి..? మళ్లీ పెరిగే ఛాన్సుందా..?
ముంబై: గత ఐదురోజులుగా బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోతూ వస్తున్నాయి. సోమవారం రోజున పుత్తడి ధరకు రెక్కలు వచ్చేశాయి. ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఏకంగా 10 గ్రాముల బంగారం రూ.40వేలు మార్క్ను తాకింది. గత ఆరేళ్లలో ఎప్పుడూ ఇంత స్థాయిలో బంగారం పెరగలేదు. ఇక భవిష్యత్తులో మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.మంగళవారం రోజున పుత్తడి ధరలు అమాంతంగా పెరిగిపోయాకా... ఆ తర్వాత స్థిరంగానే ఉన్నాయి. బంగారం ధరలు ఒక్కసారిగా పెరగిపోవడానికి కారణం ఏమిటి..?
అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం
అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ మార్కెట్లలో నెగిటివ్ టాక్ రావడం, మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ కాకపోవడం వంటి అంశాలు బంగారం ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. 2007 తర్వాత అమెరికా మార్కెట్లలో ఈ స్థాయిలో బంగారం ధరలు పెరగడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఔన్సు బంగారం ధర 1,950 డాలర్లు ఉండగా అది భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని కొటక్ కమొడిటీస్ హెడ్ రవీంద్ర రావు చెబుతున్నారు.
బంగారం వైపు మొగ్గు చూపుతున్న మదుపరులు
ప్రస్తుతం బంగారం మీదే పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్, రియల్ ఎస్టేట్, ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసేదానికంటే బంగారంలో ఇన్వెస్ట్ చేయడం వైపే మొగ్గు చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇక రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్న దేశాల మధ్య ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతుండటంతో బంగారు ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏడాది పొడవునా బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ
ఇదిలా ఉంటే ఈ ఏడాది మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం కూడా బంగారు ధరలు పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.ఆర్థిక ఇబ్బందులు వచ్చిన సమయాల్లో ఒక్క బంగారం ధర మాత్రమే పడిపోవడం లేదని.. క్రమంగా పెరుగుతోందని దీంతో చాలామంది బంగారం వైపు మొగ్గు చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆర్థిక మాంద్యం కొనసాగుతున్నందున ఇన్వెస్టర్లంతా బంగారం పైనే ఇన్వెస్ట్ చేయడం చాలా సేఫ్ అని భావిస్తున్నారు.