ఇంట్రెస్టింగ్: ఎన్నికల వేళ వీరి ఓటు బ్యాంకు పార్టీలకు అక్కర్లేదా..?
ఒకప్పుడు వారిని సమాజం చిన్నచూపు చూసేది. వారు వస్తున్నారంటే అవహేళన చేసేది. ఎక్కడికెళ్లినా వారికి అవమానాలే ఎదురయ్యేవి. చదువుకుందామంటే అడ్మిషన్లు ఇవ్వరు.. ఉద్యోగం చేస్తామంటే దరఖాస్తులో వారికి సంబంధించిన కేటగిరీ ఉండదు. సరిగ్గా అదే సమయంలో వారికి భారీ ఊరటనిచ్చే తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. దీంతో వారికి అందరిలానే అన్ని హక్కులు కల్పిస్తూ తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. వారెవరో కాదు.. ట్రాన్స్జెండర్స్. వారినే థర్డ్ జెండర్ అని కూడా పిలుస్తున్నాము. అన్ని హక్కులు ఉన్నప్పటికీ ఎన్నికల వేళ మాత్రం వారు విస్మరణకు గురవుతున్నారు. అసలు వారిని పట్టించుకునే నాథుడే లేరు.
ట్రాన్స్జెండర్లకు బ్రాండ్ అంబాసిడర్గా బిశేష్ హుయ్రెన్
ఎన్నికల వేళ థర్డ్ జెండర్ను పట్టించుకున్న నాయకులు లేరు కానీ ఎన్నికల సంఘం మాత్రం వారి పట్ల శ్రద్ధ చూపుతోంది. ట్రాన్స్జెండర్లకు ఎన్నికల పట్ల అవగాహన కల్పించేందుకు ట్రాన్స్జెండర్ మోడల్ బిశేష్ హుయ్రెంను రంగంలోకి దింపింది. ఆమె థాయ్లాండ్లో జరిగిన మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ 2016లో భారత్ తరపున పోటీలో నిల్చుంది. ట్రాన్స్జెండర్లలో ఓటింగ్ పట్ల అవగాహన కల్పించి వారు ఓటు వేసేందుక ప్రోత్సహించేలా ఆమెను ఈసీ వినియోగించుకుంటోంది.
ఓటర్లుగా నమోదు అయ్యేందుకు ట్రాన్స్జెండర్లకు అడ్డంకులు
2014లో సుప్రీంకోర్టు వీరిని థర్డ్ జెండర్స్గా గుర్తిస్తూ తీర్పు ఇచ్చింది. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు కోసం 28,527 ట్రాన్స్జెండర్లు దరఖాస్తు చేసుకుని పొందగా వారిలో 1,968 మంది ట్రాన్స్జెండర్లు మాత్రమే ఓటు వేశారు. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ట్రాన్స్ జెండర్లు 4,87,203 మంది ఉన్నారు. ఇక ఈసీ ఇచ్చిన సమాచారం మేరకు ఓటర్ల జాబితాలో 40వేల మంది ట్రాన్స్జెండర్లు నమోదై ఉన్నారు. అంటే తమ జనాభాలో కేవలం 10శాతం మంది మాత్రమే రిజిస్టర్ అయి ఉన్నారు. ఓటర్ ఐడీ కార్డు పొందాలంటే ట్రాన్స్జెండర్లకు చాలా కష్టతరంగా మారింది. వారు ట్రాన్స్జెండర్లు అని నిరూపణ చేసుకునేందుకు ఒక ధృవీకరణ పత్రం.. అది వస్తే తాము ట్రాన్స్జెండర్లమని చెప్పేందుకు స్థానిక వార్తా పత్రికల్లో వారిపై కథనం ప్రచురించబడాలని చెబుతున్నారు. అంతేకాదు తమ తల్లిదండ్రులు సంతకం పెట్టరని కూడా వారు చెబుతున్నారు. ఎందుకంటే తమ పిల్లలు ట్రాన్స్జెండర్గా చెప్పుకునేందుకు ఏ తల్లిదండ్రులు ఇష్టపడరిని వారు చెబుతున్నారు.
పార్టీలకు పట్టని ట్రాన్స్జెండర్ల ఓటు బ్యాంకు
ఇక పార్టీలు ట్రాన్స్జెండర్లను అస్సలు పట్టించుకోవు. ఎందుకంటే వారి ఓటు బ్యాంకు చాలా తక్కువ. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అలహాబాద్ నియోజకవర్గానికి ట్రాన్స్జెండర్ అయిన మహామండలేశ్వర్ భవానీ నాథ్ వాల్మికీని బరిలోకి దింపింది. ఒక వేళ ఈమె విజయం సాధిస్తే లోక్సభలో అడుగుపెట్టబోయే తొలి ట్రాన్స్జెండర్గా రికార్డు సృష్టిస్తుంది. ఇక 1998లో మధ్యప్రదేశ్ అసెంబ్లీలో తొలిసారిగా ట్రాన్స్జెండర్ షబ్నం మౌసీ అడుగుపెట్టారు. ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్ పార్టీ అప్సరా రెడ్డి అనే ట్రాన్స్జెండర్ను తమ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. ట్రాన్స్జెండర్ల హక్కులపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నప్పటికీ ఎన్నికల ప్రక్రియలో మాత్రం వారు తిరస్కరణకు గురవుతున్నారు.
మొత్తానికి 2014లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ వారికి తగినంత సమయం లేకపోవడంతో చాలా తక్కువ మంది ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈసారి మాత్రం ఆ సంఖ్య భారీగా కాకపోయినప్పటికీ ఓ మాదిరిగా పెరిగే అవకాశం ఉంది. త్వరలో వారు కూడా చట్టసభల్లో అడుగుపెట్టి తమ గళాన్ని వినిపించాలని వారి హక్కుల కోసం పోరాటం చేయాలని భావిస్తున్నారు. అయితే ఇది సాధ్యం అవుతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.