కరోనాతో కేంద్రానికి చుక్కలు- 30 లక్షల కోట్ల నష్టం- పెను సవాలుగా నిరుద్యోగిత..
కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రంగాలు కుదేలవుతున్నాయి. ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. వ్యక్తులతో పాటు సంస్ధలదీ ఇదే పరిస్ధితి. ఈ నేపథ్యంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వాలు కూడా చిగురుటాకుల్లా వణుకుతుండటం ఎన్నడూ చూడని విపత్తుగా చెప్పవచ్చు. కరోనా కారణంగా ఆవిరైపోతున్న ఉద్యోగాలు ప్రభుత్వాలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా ఆత్మరక్షణలో పడుతుండటంతో ప్రజల్లో నమ్మకం కూడా సడలిపోతున్న పరిస్ధితులు పలుచోట్ల కనిపిస్తున్నాయి. దీంతో నిరుద్యోగ సమస్యను కేంద్రం ఎలా పరిష్కరిస్తుందో అన్న ఉత్కంఠ పెరుగుతోంది.
కరోనా విలయంపై కేంద్రం కీలక ప్రకటన-లాక్డౌన్తో 78వేల ప్రాణాలు సేఫ్-లోక్ సభకు ఆరోగ్య మంత్రి బ్రీఫింగ్
కరోనాతో కేంద్రం కుదేలు...
కరోనా కారణంగా తలెత్తిన సంక్షోభం జాతీయ వృద్ధిరేటుపై తీవ్రంగా పడుతోంది. జీడీపీ వృద్ధి గతంలో ఎన్నడూ లేనంతగా మైనస్ 23 శాతానికి చేరుకోవడం కేంద్రాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. ఆర్ధికవేత్తల అంచనాలకు కూడా అందకుండా జీడీపీ వృద్ధిరేటు పడిపోతోంది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా దాదాపు లక్ష కొత్త కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ తర్వాత కేంద్రం జీడీపీలో భారీ మొత్తాన్ని కేంద్రం ఉద్దీపన ప్యాకేజీగా ప్రకటించింది. అయినా తాజా అంచనాల ప్రకారం కరోనా కారణంగా కేంద్రం ఎన్నడూ లేనంతగా జీడీపీలో 13 శాతం మొత్తాన్ని శాశ్వతంగా కోల్పోతున్నట్లు తేలింది. దీని విలువ రూ.30 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇది ఓ ఆర్ధిక సంవత్సరం కేంద్ర బడ్జెడ్తో సమానం.
ఆవిరైపోతున్న ఉద్యోగాలు...
కరోనా సంక్షోభం కారణంగా ఉపాధి రంగం తీవ్రంగా దెబ్బతింది. కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు ఆవిరైపోయాయి. ప్రస్తుతం తాజా అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నట్లు తేలింది. ఇందులో 2.1 కోట్ల మంది కరోనా తర్వాత ఉద్యోగాలు కోల్పోయిన వారేనని తేలింది. వీరికి ఇప్పట్లో ఉద్యోగాలు కూడా దొరికే అవకాశం లేనట్లు తాజా అంచనాలు స్ఫష్టం చేస్తున్నాయి. కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో చాలా మంది వ్యవసాయ రంగానికి మారిపోయినట్లు కూడా తెలుస్తోంది. వీరంతా ఉపాధి పొందుతున్నట్లుగా లెక్కించారు. తాజాగా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 20 లక్షల మంది కొత్తగా పనిచేసే వయసులో ఉంటూ ఈ జాబితాలో చేరినట్లు తేలింది. అంటే వీరంతా 15 నుంచి 59 ఏళ్ల మధ్య వారేనని తెలుస్తోంది.
కేంద్రానికి నిరుద్యోగిత సవాళ్లు...
పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్లో ఉద్యోగాలు, ఉపాధి కావాలని కోరుకునే వారి శాతం 40 శాతంగా ఉంటుందని తేలింది. అదే విదేశాల్లో అయితే 60 శాతంగా ఉంది. ఈ 40 శాతం మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా ప్రభుత్వాలకు సవాలుగా మారుతోంది. ఈ లెక్కన చూసినా ప్రస్తుతం కోటి కొత్త ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది. కానీ ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి భారత్లో యువత ఇప్పుడున్న ఉద్యోగాలు కోల్పోకుండా ఉంటే 4.5 కోట్ల కొత్త ఉద్యోగాలు అవసరమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
2016-17తో పోలిస్తే 2019-20 నాటికి భారత్లో నిరుద్యోగుల సంఖ్య 40.7 కోట్ల నుంచి 40.3 కోట్లకు తగ్గింది. కానీ కరోనా కారణంగా పరిస్ధితి మళ్లీ మొదటికొచ్చింది.
Recommended Video
వ్యవసాయంవైపు చూపు..
ప్రస్తుత పరిస్ధితుల్లో ప్రతీ ఏడాది కొత్తగా కోటి మంది నిరుద్యోగులు ఉపాధి పొందుతున్నారు. తాజాగా కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల కారణంగా వ్యవసాయ రంగంపైపు నిరుద్యోగులు ఆకర్షితులవుతున్నట్లు తెలుస్తోంది. వీరంతా గతంలో ఏదో ఒక సమయంలో వ్యవసాయ ఆథారిత పనుల్లో ఉన్న వారే కావడం విశేషం. తాజాగా హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో రైతులు మద్దతు ధరల కోసం నిరసనలకు దిగుతున్నారు. వ్యవసాయేతర రంగాల్లో బ్యాంకుల ద్వారా మరిన్ని రుణాలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. నేరుగా ప్రజలకు డబ్బులు ఇచ్చే బదులుగా వారికి రుణాలు ఇవ్వడమే మేలని తాజాగా ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందుకు సహకరించాలని ప్రైవేటు బ్యాంకులను కోరారు. ప్రభుత్వ పథకాల అమలు కూడా ఈ విధానం వల్ల సాధ్యమవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.