డిసెంబర్ 3 దాకాఎందుకు .. రైతులతో ఇప్పుడే చర్చలు జరపండి : పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ డిమాండ్
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతులు చలో ఢిల్లీ పేరుతో నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. నిన్న పంజాబ్ ,హర్యానా రాష్ట్రాలలో రైతులు చలో ఢిల్లీ అంటూ లాంగ్ మార్చ్ ను ప్రారంభించిన నేపధ్యంలో వారిని అణచి వేయడానికి పోలీసులు వాటర్ క్యానన్లను ఉపయోగించారు. భారీ బారికేడ్లను, ముళ్ల కంచెలను ఏర్పాటు చేసి రైతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో నిన్న రైతుల ఆందోళన హింసాత్మకంగా మారింది.
రైతులు నేరస్థులు, ఉగ్రవాదులు కాదు ... ఢిల్లీ పోలీసుల తాత్కాలిక జైళ్ళ అభ్యర్ధనపై ఆప్ ఎమ్మెల్యేలు ఫైర్
రైతుల ఆందోళన ఆపటం సాధ్యం కాదన్న పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్
ఈ రోజు కూడా రైతులు తమ నిరసనను తెలియజేయడానికి ఢిల్లీ బాట పట్టారు. ఇప్పటికే పంజాబ్ ఢిల్లీ బోర్డర్లో, హర్యానా ఢిల్లీ బోర్డర్లో భారీగా రైతులు చేరుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులతో డిసెంబర్ 3వ తేదీన చర్చలు జరుపుతామని పేర్కొంది. కేంద్రం ప్రకటన పై స్పందించిన పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ రైతుల ఆందోళనలు ఆపలేరని, డిసెంబర్ 3 దాకా ఎందుకు వేచి చూడాలని ప్రశ్నించారు.
రైతులు కోరుకునేది కనీస మద్దతు ధర .. అది కూడా ఇవ్వలేమా ?
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన తక్షణమే రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రైతులు కోరుతున్న కనీస మద్దతు ధర పై కేంద్రం భరోసా ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఏ రైతు అయినా కోరుకునేది పండించిన పంటకు గిట్టుబాటు ధరే అన్న అమరేందర్ సింగ్, నోటి మాటతో ఇచ్చే భరోసా కు చట్టం రూపు ఎందుకు తీసుకు రావడం లేదని ప్రశ్నించారు. రైతులు ఆందోళన వెనక కాంగ్రెస్ ఉందనే వారు గుడ్డి వారేనని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజా వ్యవసాయ చట్టాలపై ఆందోళన తెలియజేస్తుంది కేవలం పంజాబ్ హర్యానా రాష్ట్రాల రైతులు మాత్రమే కాదన్నారు .
తక్షణ నిర్ణయం తీసుకుంటే తప్పేంటి ? ప్రశ్నించిన పంజాబ్ సీఎం
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని రైతులు ఆందోళనలో భాగస్వామ్యం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. పరిస్థితి ఇప్పుడు చేతిలో లేదని , పరిస్థితిని అదుపులోకి తీసుకురావటానికి తక్షణ నిర్ణయం తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఇప్పటికే రైతుల ఆందోళనలతో దేశం దృష్టి ఒక్కసారిగా వ్యవసాయ చట్టాలపై పడింది. పోలీసులు రైతుల ఉద్యమాన్ని అణచివేయాలని ఎంత ప్రయత్నం చేసినా, ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుంది తప్ప, వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాలు తేల్చి చెబుతున్నాయి.