యోగీ ఆదిత్యనాథ్ను ఎందుకు విచారణ చేయకూడదో చెప్పండి: సుప్రీం ప్రశ్న
ఢిల్లీ: 2007లో ప్రస్తుత ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ విద్వేషపూరితమైన ప్రసంగం చేశారు. అప్పట్లో కేసు కూడా నమోదైంది. అయితే ఈ కేసును ఎందుకు విచారణ చేపట్టకూడదో చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ కేసును ముందుగా విచారణ చేసిన అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా... పిటిషన్ను విచారణకు స్వీకరించింది కోర్టు.
2007లో గోరఖ్ పూర్ అల్లర్ల కేసులో యోగీ ఆదిత్యనాథ్కు సంబంధం ఉందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐతో విచారణ చేయించాలంటూ అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణ చేసిన అలహాబాద్ హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది. 2008 నవంబర్లో మొహమ్మద్ హయత్, పర్వేజ్లు ఈ రిట్ పిటిషన్ను దాఖలు చేశారు. 2007లో ఆనాడు గోరఖ్ పూర్ ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం యోగీ ఆదిత్యనాథ్ రెచ్చగొట్టే ప్రసంగం చేయడంతో అల్లర్లు చెలరేగాయని వారు చెప్పారు. ఈ అల్లర్లలో ఒకరు మృతి చెందారని పిటిషన్లో పేర్కొన్నారు. పర్వాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో సాక్షంగా హయత్ ఉన్నాడు.
జనవరి 2007లో మొహర్రం సందర్భంగా గోరఖ్ పూర్లో హిందువులు ముస్లింలకు మధ్య జరిగిన ఘర్షణల్లో రాజ్ కుమార్ అగ్రహారి అనే హిందూ మతానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఆనాడు ఘర్షణలు జరిగిన ప్రాంతాన్ని యోగీ ఆదిత్యనాథ్ సందర్శించకూడదని... దీనివల్ల హింస చెలరేగే అవకాశముందని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది. అయితే అహింసా పద్ధతిలోనే ఘటనాస్థలంలో యోగీ ఆదిత్యనాథ్ ధర్నా చేశారు. ఈ సందర్భంగా కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు యోగీ ఆదిత్యనాథ్ చేశారు. దీంతో ఆయన అనుచరులు కొన్ని ముస్లిం కట్టడాలకు నిప్పంటించారు. ఆ సమయంలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఆదిత్యనాథ్ను జైలుకు తరలించారు.
యోగీ ఆదిత్యనాథ్ అరెస్టుతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ముంబై నుంచి గోరఖ్ పూర్ వెళ్లే గోదాన్ ఎక్స్ప్రెస్కు హిందూ యువవాహిని కార్యకర్తలు నిప్పంటించారు. దీంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. నాటి అల్లర్లలో ఆందోళనకారులు మసీదులను, ఇళ్లను, బస్సులను, రైళ్లను తగులబెట్టారు.