యూపీలో మహిళలపై నేరాలు మీకు పట్టవా...? సీఎం యోగిపై విరుచుకుపడ్డ ఎంపీ నుస్రత్ జహాన్...
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన ముఖ్యమంత్రికి సొంత రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు పట్టవా అని ప్రశ్నించారు. హత్రాస్లో అత్యాచార బాధితురాలి తండ్రిని నిందితుడే కాల్చి చంపిన ఘటనపై ఆమె ట్విట్టర్లో స్పందించారు.
'బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ ఘోరాన్ని వర్ణించేందుకు మాటలే దొరకడం లేదు. యోగి ఆదిత్యనాథ్కు ఆ బాధిత కుటుంబానికి రక్షణ కల్పించడం కన్నా బెంగాల్ ఎన్నికలే ముఖ్యమా...?' అని నుస్రత్ ప్రశ్నించారు. మరో ట్వీట్లో యోగిని ఎద్దేవా చేసే కార్టూన్లతో కూడిన ఫోటోను ఎంపీ షేర్ చేశారు. అందులో యూపీ రేప్ క్యాపిటల్గా మారిపోతోందని... అత్యాచార నిందితులపై చర్యలేవీ అని ఓ వ్యక్తి ముఖ్యమంత్రి యోగిని ప్రశ్నిస్తాడు.దానికి యోగి... నా వద్ద ఓ ప్లాన్ ఉంది... వాళ్లందరినీ బీజేపీలో చేరేలా చేస్తా..' అంటూ బదులిస్తాడు.
మంగళవారం(మార్చి 2) సీఎం యోగి బెంగాల్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. బెంగాల్లో గోవుల అక్రమ రవాణా,లవ్ జిహాద్ యథేచ్చగా జరుగుతున్నాయని... అయినా ప్రభుత్వం వైపు నుంచి చర్యలు లేవని విమర్శించారు. రాష్ట్రంలో దుర్గా పూజను నిషేధించారని... ఈద్ ప్రారంభం కాగానే గోవులను వధించేందుకు కబేళాలు తెరుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జైశ్రీరామ్ స్లోగన్ను కూడా నిషేధించారని ఆరోపించారు.
యోగి చేసిన ఈ ఆరోపణలను ఎంపీ నుస్రత్ జహాన్ పరోక్షంగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. సొంత రాష్ట్రం యూపీలో మహిళలకే రక్షణ కరువవుతుంటే... బెంగాల్కొచ్చి ఎన్నికల ప్రచార చేయడమేంటని ఆమె ప్రశ్నించారు. యోగి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు.
కాగా,యూపీలోని హత్రాస్లో అత్యాచార బాధితురాలి తండ్రిని నిందితుడే గన్తో కాల్చి చంపిన ఘటన దేశంలో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని,న్యాయం చేయాలని ఆ బాలిక తీవ్రంగా విలపిస్తూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలో ఉన్నావ్ కేసులోనూ అత్యాచార బాధితురాలిపై నిందితులు కిరోసిన్ పోసి నిప్పంటించడంతో ఆమె మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక గతేడాది హత్రాస్లో దళిత యువతిపై హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఎంత నిరసన జ్వాల వ్యక్తమైందో తెలిసిందే. సమాజం నుంచి ఎంత ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నా... యూపీలో పరిస్థితి మాత్రం రోజురోజుకు మరింత తీసికట్టుగా తయారవుతోంది. మహిళా భద్రత ప్రశ్నార్థకమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.