కరోనా వ్యాక్సిన్ పై WHO కీలక ప్రకటన - వచ్చే ఏడాది ద్వితీయార్థం దాకా లేనట్లే - ఫేజ్-3పై హడావిడి వద్దు
కొవిడ్-19 వ్యాధికి విరుగుడు వ్యాక్సిన్ ప్రయోగాల్లో అగ్రదేశాలు, దిగ్గజ కంపెనీలు పోటాపోటీగా వ్యవహరిస్తుండటం.. ఈ ఏడాది చివరిలోగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని ప్రకటనలు చేస్తున్న దరిమిలా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది ద్వితియార్ధం నాటికి గానీ కొవిడ్ వ్యాక్సిన్ విస్తృత స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది.
Recommended Video
ఇప్పటికే గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 2.65 కోట్లకు, మరణాల సంఖ్య 9 లక్షలకు చేరువైన నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీ అవసరతను గుర్తిస్తూనే, సేఫ్టీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. డబ్ల్యూహెచ్వో అధికార ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్ శుక్రవారం జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు కీలక కామెంట్లు చేశారు.
''మా అంచనా ప్రకారం వచ్చే ఏడాది మధ్యకాలం నాటికి విస్తృతంగా కొవిడ్ టీకాలు వస్తాయని ఆశించడం లేదు. దానికి సహేతుక కారణాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని సంస్థలు రూపొందించిన వ్యాక్సిన్లు ఫేజ్-3 క్లినికల్ ట్రయల్ దశలో ఉన్నాయి. ఈ దశను హడావుడిగా ముగించేయడం ఏమాత్రం సబబు కాదు. ఫేజ్3కి వీలైనంత ఎక్కువ సమయం తీసుకోవాలి. వ్యాక్సిన్ కచ్చితంగా ప్రమాదకారి కాబోదని, ప్రజలకు సేఫ్టీ ఇస్తుందని నిర్ధారణ కావాల్సింది ఈ దశలోనే'' అని మార్గెట్ హ్యారిస్ వ్యాఖ్యానించారు.