భర్త అంత్యక్రియల కోసం పిల్లలను తాకట్టుపెట్టింది
భువనేశ్వర్: ఒరిస్సా రాష్ట్రంలోని చంపువా ప్రాంతంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. కుటుంబానికి అండగా ఉన్న పెద్ద దిక్కు అనుకోకుండా మృతి చెందడంతో అతని అంత్యక్రియలకు అయిన అప్పులు చెల్లించడానికి వేరే దారి లేక తన ఇద్దరు పిల్లలను ఓ తల్లి తాకట్టుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వివరాల్లోకి వెళ్తే.. చంపువా ప్రాంతంలోని గందూలి గ్రామానికి చెందిన రోజు కూలి రైబా.. అనారోగ్యంతో గణతంత్ర దినోత్సవం రోజున మృతి చెందాడు. అప్పటి వరకు కూడబెట్టిన కొద్దిపాటి డబ్బు కూడా రైబా ఆస్పత్రి ఖర్చులకే కరిగిపోవడంతో భార్య సావిత్రికి అతని అంత్యక్రియలను నిర్వహించడానికి చేతిలో చిల్లిగవ్వ మిగలలేదు.
ఈ నేపథ్యంలో తెలిసిన వారిని సహాయం కోసం అర్ధించినా అందరూ మొహం చాటేశారు. దీంతో తన ఇద్దరు పిల్లలు ముఖేశ్(13), సుఖేష్(11) లను పొరుగువారి వద్ద రూ. రూ. 5,000 లకు తాకట్టుపెట్టిన సావిత్రి భర్త అంత్య క్రియలు నిర్వహించింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రాంతీయ అభివృద్ధి అధికారి ఎస్ నాయక్ బుధవారం ఆ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఇద్దరు పిల్లలను తాకట్టు నుండి విడిపించారు. వారికి విద్యా సౌకర్యాలను అందించనున్నట్లు అధికారులు హామీ ఇచ్చారు. కాగా సావిత్రికి మరో ముగ్గురు పిల్లలు ఆకాశ్(9), చిల్లరి(8), బర్షా(4) ఉన్నారు.