దారుణం: అద్దెకు ఉంటోన్న వితంతువును కొట్టి చంపిన ఇంటి ఓనర్..!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అద్దె ఇంట్లో నివసిస్తోన్న వితంతువు ఒకరు హత్యకు గురయ్యారు. ఆమె నివసిస్తోన్న ఇంటి ఓనరే ఆమెను కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇంటి ఓనర్, అతనికి సహకరించిన కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. హతురాలి పేరు మంజు గోయల్. ఏడాది కిందట ఆమె భర్త మరణించాడు. దీనితో ఆమె ఆరు నెలలుగా న్యూఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఓ చిన్న ఇంట్లో అద్దె ఒంటరిగా నివసిస్తున్నారు. ఆ ఇళ్లు సతీష్ పహ్వా అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిది. రెండురోజుల కిందట సతీష్ పహ్వా ఇంట్లో కొన్ని వస్తువులు, కొంత నగదు చోరీకి గురైంది.
ఈ దొంగతనం చేసింది మంజు గోయెల్ అని అనుమానించారు సతీష్ కుటుంబ సభ్యులు. శనివారం రాత్రి ఆమెపై దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో మరణించింది. ఆమె చనిపోయినప్పటికీ పట్టించుకోలేదు ఓనర్, అతని కుటుంబ సభ్యులు.
ఇంట్లో చొరబడి ఆమె దాచుకున్న 60 వేల రూపాయలను లాక్కున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే మంజు గోయల్ సోదరుడు సంఘటనాస్థలానికి రాగా.. అతడిపైనా దౌర్జన్యం చేశారు. దీనిపై స్థానికులు మెహ్రౌలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సతీష్ పహ్వా, అతని కుమారుడిని హత్యానేరం కింద అరెస్టు చేశారు.