మా ఎమ్మెల్యేల భార్యలకు బీజేపీ నేతల ఫోన్: కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత వీఎస్ ఉగ్రప్ప ముఖ్యమంత్రి యడ్యూరప్ప పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి చెందిన విజయేంద్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల భార్యలకు ఫోన్ చేసి మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు.
అందరి కళ్లు ఆ 20 మంది ఎమ్మెల్యేల పైనే: యెడ్డీకి షాకిస్తారా, సొంత పార్టీని కాదంటారా?
విజయేంద్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల భార్యలకు ఫోన్ చేస్తున్నారని, మీ భర్తలకు మంత్రి పదవులు ఇస్తామని, రూ.15 కోట్లు ఇస్తామని చెబుతున్నారని, వారితో బీజేపీకి ఓటు వేయించమని చెబుతున్నారని తీవ్రవ్యాఖ్యలు చేశారు.
వారి కోసం వెళ్లిన నేతలు
ఇదిలా ఉండగా, మధ్యాహ్నానికి అసెంబ్లీలో ఇప్పటి వరకు 193 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. వెస్ట్ ఎండ్ హోటల్లో ఇధ్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిని తీసుకు రావడానికి రేవణ్ణ, పాటిల్ వెళ్లారు. తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్కు కాంగ్రెస్ సీనియర్ నేత డీకే సురేష్ కుమార్ వెళ్లారు. బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర రెడ్డి సభకు హాజరు కాలేదు.
సభకు వస్తారు, ఓటు వేస్తారు
మరోవైపు, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంకా అజ్ఞాతం వీడలేదు. ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్లు ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. దీంతో కాంగ్రెస్ - జేడీఎస్ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. వారు సభకు వస్తారని, ఓటు వేస్తారని చెప్పారు.
యెడ్డీ, సిద్ధూల ప్రమాణం
శనివారం కర్ణాటక అసెంబ్లీ కొలువు దీరింది. 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ బోపయ్య సభ్యులతో ప్రమాణస్వీకార కార్యక్రమం చేపట్టారు. తొలుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య శాసనసభ్యునిగా ప్రమాణం చేశారు.
స్పీకర్ పాత్ర కీలకం
సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం యడ్యూరప్ప సర్కార్ బలనిరూపణ సాయంత్రం నాలుగు గంటలకు జరగనుంది. విశ్వాస పరీక్షలో ప్రొటెం స్పీకర్ పాత్ర కీలకం కానుంది. ఓట్లు లెక్కించి ఫలితాన్ని ప్రొటెం స్పీకర్ వెల్లడిస్తారు. ఇప్పుడు అందరి దృష్టి ప్రొటెం స్పీకర్ పైన ఉంది.